తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ నియమితులయ్యారు. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్.. తెలుగునాట మరే ఇతర రాజకీయ నాయకుడు ఎదుర్కోనంత ట్రోలింగ్ను ఎదుర్కొన్నారు. ‘పప్పు’ అని లోకేశ్ను ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. తెలుగులో మాట్లాడలేడంటూ.. వర్థంతికి, జయంతికి తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయ్యాడంటూ విమర్శించారు. వీటన్నింటినీ దాటుకొని.. తనను తాను మలుచుకుంటూ లోకేశ్ ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేశ్కు తెలుగుదేశం పార్టీ పట్టం కట్టింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆయనకు అప్పగించి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్కు ఇది కీలక ప్రమోషన్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీలో నంబర్ 2గా కొనసాగుతున్న లోకేశ్.. తండ్రి తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టే దిశగా మరో అడుగు ముందుకేశారు. అయితే లోకేశ్ రాజకీయ ప్రస్థానం అంత సాఫీగా సాగలేదు. ప్రత్యర్థి పార్టీ నేతలు ఆయన్ను ‘పప్పు’ అంటూ ఎద్దేవా చేశారు. తెలుగులో మాట్లాడలేడంటూ విమర్శించారు. వాటన్నింటినీ తట్టుకొని లోకేశ్ ఈ స్థాయికి చేరుకున్నారు.
నారా లోకేశ్ 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని గండిపేటలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకు ముందు 2009 ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన నగదు బదిలీ హామీ లోకేశ్ ఐడియా అని చంద్రబాబు చెప్పారు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లోకేశ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.
2017లో శాసన మండలికి ఎన్నికైన లోకేశ్ మంత్రి పదవిని చేపట్టారు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి తెలుగునాట ఏ నాయకుడూ ఎదుర్కోనన్ని విమర్శలు, ట్రోల్స్ను లోకేశ్ ఎదుర్కొన్నారు. విపక్ష వైసీపీ నేతలు ఆయన్ను ‘పప్పు’ అంటూ ఎద్దేవా చేశారు. లోకేశ్ తెలుగు ప్రసంగాల్లో తడబడేవారు. కొన్ని పదాల ఉచ్ఛారణ సరిగా ఉండేది కాదు. దీంతో తెలుగు సరిగా మాట్లాడలేడంటూ హేళన చేసేవారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలీదంటూ విమర్శించారు. ఓ సందర్భంలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ‘ఒరేయ్ మనవడా మంగళగిరి అని స్పష్టంగా పలుకు.. నా ఓటు నీకే’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. చాలా మంది వైసీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్తో లోకేశ్కు పోలికలు తీసుకొచ్చారు.
2019 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్.. రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో ముందు ఎమ్మెల్యేగా లేవు.. ఆ తర్వాత పదవుల సంగతి చూడొచ్చంటూ హేళనగా మాట్లాడారు.
ఒక్కో లోపాన్ని సరిచేసుకుంటూ…
తీవ్ర స్థాయిలో ట్రోల్స్, విమర్శలు, ఎద్దేవాలు, ఎన్నికల్లో ఓటమి.. మరో నాయకుడైతే కుంగిపోయేవాడేమో. రాజకీయ రంగం నుంచి తప్పుకునే వాడేమో. కానీ లోకేశ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థుల విమర్శలను తన ఎదుగుదల సోపానాలుగా మలుచుకున్నాడు. తనలోని ఒక్కో లోపాన్ని సరిచేసుకుంటూ.. ప్రత్యర్థుల విమర్శలకు మాటలతో కాకుండా, చేతలతోనే సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే తన ఫిట్నెస్పైనా ఆయన పూర్తి శ్రద్ధ పెట్టారు. తనను ఓడించినా సరే మంగళగిరి ప్రజలకు నిత్యం అండగా ఉంటూ, తన సొంత నిధులు ఖర్చు చేసి వారికి దగ్గరయ్యారు.
యువగళం ప్రజలకు చేరువ చేసింది…
తెలుగులో స్పష్టంగా మాట్లాడటంపై ఫోకస్ పెట్టడమే కాకుండా.. తన ప్రసంగ శైలిని సైతం లోకేశ్ మార్చుకున్నారు. తనను ఎద్దేవా చేసిన వారే ఆశ్చర్యపోయేంతగా ఆయనలో మార్పు వచ్చింది. అయితే యువగళం పేరిట రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర లోకేశ్లోని అసలైన నాయకుణ్ని బయటకు తెచ్చింది. 3 వేల కిలోమీటర్లకుపైగా సాగిన ఈ పాదయాత్రలో లోకేశ్ సామాన్య ప్రజానీకంతో మమేకం అయ్యారు. వారి కష్టాలు చూసి చలించిపోయారు, వారి అవసరాలను తెలుసుకొని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలను ఆలోచింపజేశారు.
అప్పటి వరకూ ఏసీ గదుల్లో ఉండి పని చేసే సాఫ్ట్ ఇమేజ్ ఉన్న లోకేశ్.. యువగళం తర్వాత ప్రజల మనిషి అయ్యారు. పాదయాత్ర సమయంలోనే రెడ్ బుక్ కాన్సెప్ట్ను తీసుకొచ్చిన లోకేశ్.. టీడీపీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందిపెట్టిన అధికారులు, పోలీసుల పేర్లను అందులో రాసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాన్ని అతిక్రమించిన వారిపై విచారణ జరిపి, రెడ్ బుక్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో కార్యకర్తలు ధైర్యంగా బయటకు రాగలిగారు.
తండ్రి అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారు…
2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేశ్ వ్యవహరించిన తీరు పార్టీ శ్రేణుల్లో ఆయన పట్ల నమ్మకాన్ని మరింతగా పెంచింది. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడం, నేషనల్ మీడియా చర్చల్లో పాల్గొనడం, తన తండ్రిపై నమోదైన కేసుల్లోని లోపాలను ఎత్తి చూపడం ద్వారా జాతీయ స్థాయిలోనూ తాను ప్రభావం చూపగలనని చాటారు. క్లిష్ట సమయంలో పార్టీని ముందుండి నడిపించి టీడీపీలో నంబర్ 2 స్థానం తనదేనని చెప్పకనే చెప్పారు.
తండ్రికి తగ్గ తనయుడిగా…
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించిన తర్వాత లోకేశ్ స్థాయి మరింత పెరిగింది. 2019లో ఓడిన మంగళగిరిలోనే ఈసారి ఆయన రికార్డు మెజార్టీతో గెలుపొందారు. ఐటీ, విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన పరిణతికి అద్దం పడుతున్నాయి. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో లోకేశ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ను ‘పవన్ అన్నా’ అని ఆప్యాయంగా సంబోధిస్తూ.. జనసైనికుల మనసులోనూ స్థానం సంపాదించారు. పరిశ్రమల యాజమాన్యాలతో చర్చిస్తూ.. ఎవరూ ఊహించని రాయితీలను ప్రకటిస్తూ.. గూగుల్ డేటా సెంటర్ లాంటి వాటిని సైతం రాష్ట్రానికి రప్పించడంలో లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని రాష్ట్రం కోసం వాడుకోవడానికి లోకేశ్ పరితపిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్న లోకేశ్.. టీడీపీలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఒకప్పుడు తనను విమర్శించిన వారే ఆశ్చర్యపోయేంతగా లోకేశ్ ఎదిగి చూపించారు. తెలుగు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
