ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఇప్పటివరకు ఉన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. స్పెల్లింగ్ విషయంలో స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పరిపాలనలో రాజధాని పేరును ఏకరూపంగా వాడేలా అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అమరావతి ఇక నుంచి ‘Amaravathi’ (Thi) కి బదులుగా ‘Amaravati’ (Ti) అని మాత్రమే రాయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఉత్తర్వులు (జీవోలు), ఫైళ్లు, నోట్ షీట్లలో రాజధాని పేరును కచ్చితంగా ‘అమరావతి’గానే పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు, సచివాలయ విభాగాలు ఈ కొత్త మార్పును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది.
