Driver Subramanyam Murder Case ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.
ఈ వ్యవహారంలో లక్ష్మీదుర్గ ప్రమేయంపై సిట్ సేకరించిన ప్రాథమిక ఆధారాలను న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించింది. హత్య జరిగిన అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేయడంలోనూ, మృతదేహాన్ని తరలించిన వాహనంలో ఆమె స్వయంగా ఉన్నట్లు ప్రాసిక్యూషన్ బలమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. ఈ క్రమంలో ఆమెను ఏ2 నిందితురాలిగా చేర్చడం సరైనదేనని అభిప్రాయపడిన కోర్టు, దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ప్రస్తుతం ఆమెను కేసు నుంచి తప్పించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
మరోవైపు, తన భార్య అమాయకురాలని, రాజకీయ కక్షతోనే ఆమెను ఈ కేసులో ఇరికించారని అనంతబాబు వాదించినప్పటికీ న్యాయస్థానం దానికి అంగీకరించలేదు. నిందితుల తరపు వాదనలను తోసిపుచ్చుతూ, కేసు పూర్వాపరాలను బట్టి విచారణ కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పింది. తాజా తీర్పుతో ఈ కేసులో అనంతబాబు కుటుంబానికి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
