US-Iran Tensions: అమెరికా- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఇప్పుడు చైనా కూడా వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఇరాన్కు సైనిక సహాయం అందించేందుకు చైనా సిద్ధమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. నివేదికల ప్రకారం.. చైనా ఇరాన్కు ఆయుధాలను, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేదా క్షిపణి సాంకేతికతను అందించవచ్చని అమెరికన్ నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. దీని ఆధారంగానే ట్రంప్ చైనాను తీవ్రంగా హెచ్చరిస్తూ బీజింగ్ ఇలాంటి చర్యలకు పాల్పడితే భారీ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
చైనా ఏమన్నది?
ఇరాన్కు సైనిక సహాయం అందించే దేశాలపై అమెరికా 50% వరకు టారిఫ్ (సుంకాలు) విధించవచ్చని కూడా ట్రంప్ చెప్పారు. ఈ హెచ్చరిక నేరుగా చైనా, రష్యా వంటి దేశాలను ఉద్దేశించినట్లుగా భావిస్తున్నారు. అయితే చైనా ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. ఇవన్నీ నిరాధారమైన, అబద్ధపు ఆరోపణలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్కు ఆయుధాలు ఇచ్చే విధానాన్ని తాము ఎప్పుడూ అనుసరించలేదని చైనా స్పష్టం చేసింది. తాము ఎల్లప్పుడూ శాంతి, దౌత్యానికి మద్దతు ఇస్తామని, ఏ సంఘర్షణను పెంచడంలో తమకు పాత్ర లేదని చైనా పేర్కొంది. అదే సమయంలో అమెరికానే ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ లో సైనిక కార్యకలాపాల ద్వారా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతోందని చైనా ఆరోపించింది.
Also Read: MK Stalin: డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రానికి స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్.
ప్రమాదం పెరగవచ్చా?
మరోవైపు ఇరాన్పై ఒత్తిడి పెంచడానికి అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో నౌకాదళ దిగ్బంధాన్ని కూడా అమలు చేసింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేసేలా ఒత్తిడి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఈ చర్య ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపింది. చైనా- ఇరాన్ మధ్య సైనిక సహకారం పెరిగితే, ఈ ఘర్షణ మరింత తీవ్ర రూపం దాల్చవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల కేవలం మిడిల్ ఈస్ట్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
