టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రజలు అపూర్వస్వాగతం పలికారు.అడుగడుగునా చంద్రబాబుపై ప్రజలు పూలవర్షం కురిపించారు. విజయవాడకు చేరుకునే సరికి తెల్లవారుజామున 5 గంటలు కావోస్తున్నా ప్రజలు మాత్రం చంద్రబాబు కోసం రోడ్లపై పడిగాపులు కాశారు. బెంజిసర్కిల్ నుంచి చంద్రబాబు కాన్వాయ్ ఉదయం 5.15గంటల ప్రాంతంలో బందరు రోడ్డు మీదుగా కేశినేని భవన్ వద్దకు చేరుకుంది. కేశినేని భవన్ వద్ద టీడీపీ యువనాయకురాలు కేశినేని శ్వేత నేతృత్వంలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు, పశ్చిమ నియోజకవర్గ నాయకులు M.S. బేగ్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఘనస్వాగతం పలికారు. 52 రోజుల తర్వాత నారా చంద్రబాబు నాయుడుని చూసి కేశినేని శ్వేత భావోద్వేగానికి గురైయ్యారు. చంద్రబాబుతో శ్వేతా మాట్లాడుతూ ఆరోగ్యం గురించి అడిగారు. తాను బాగానే ఉన్నానని. మీరు జాగ్రత్త అమ్మ అంటూ శ్వేతకి చంద్రబాబే ధైర్యం చెప్పారు.చంద్రబాబునాయుడుకు స్వాగతం పలుకుతూ ఎన్టీఆర్ జిల్లా నేతలు కాగడాల ప్రదర్శన చేశారు. నిన్న సాయంత్రం 4.15గంటలకు రాజమండ్రి జైలు వద్దనుంచి బయలుదేరి 14 గంటలుగా నిర్విరామంగా చంద్రబాబు నాయుడు ప్రయాణం చేశారు.