తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీపాదం, అచ్యుతం సముదాయాల నిర్మాణం 75% పూర్తయింది. దాదాపు పదివేల మందికి వసతి కల్పించే ఈ ప్రాజెక్టుతో పాటు, అలిపిరి సమీపంలోనూ కొత్త వసతి సముదాయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో భక్తుల వసతి సమస్యలు త్వరలో తీరనున్నాయి. ఈ రెండు సముదాయాలు అందుబాటులోకి వస్తే శ్రీవారి భక్తులకు గదుల సమస్యలు ఉండవని చెబుతున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎదుర్కొంటున్న వసతి సమస్యలు త్వరలోనే తీరనున్నాయి.. త్వరలో వసతి సౌకర్యం మెరుగుపడనుంది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల పనులు 75% పూర్తయ్యాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా, లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల కల్పన పనులు మిగిలి ఉన్నాయి.
తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో కొత్తగా శ్రీపాదం, అచ్యుతం అనే రెండు సముదాయాలను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయింది. అయితే గదులలోపల అవసరమైన ఏర్పాట్లు చేయడం, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ పనులు చాలా ముఖ్యమైనవి.
తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల్లో.. ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మిస్తున్నారు. గదులు 532 చొప్పున 1,064 ఉన్నాయి. దాదాపుగా పదివేల మంది భక్తులకు వసతి కల్పించొచ్చు. రెండో అంతస్తులో రిసెప్షన్, అన్నదానం, వసతి కేంద్రాలు ఉంటాయి. మూడు, నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు.. సుమారు 7,000 మందికి సరిపడా లాకర్ల ఏర్పాటు చేస్తున్నారు. 2024 మార్చి నెలలో పనులు ప్రారంభం అయ్యాయి.. ఏప్రిల్, 2026 నాటికి పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. ఈ రెండు సముదాయాల నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చవుతోంది. వాస్తవానికి తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే గోవిందరాజుల సత్రంలో గదులు తీసుకుంటారు. అయితే అక్కడా గదులు ఫుల్ అవుతున్నాయి.. ఈ క్రమంలో ఆ సత్రం స్థానంలో శ్రీపాదం, అచ్యుతం సముదాయాలను నిర్మిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నెరవేరబోతోంది. ఇక గదుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు. దాదాపు 10వేలమందికి గదులు అందుబాటులోకి వస్తాయంటున్నారు. తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలో గదులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
అంతేకాదు టీటీడీ ఇటీవల మరో కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి సమీపంలో కూడా భక్తుల కోసం మరికొన్ని వసతి సముదాయాలను నిర్మించాలని నిర్ణయించారు. తిరుమలలో వసతి గదులు సరిపోవడం లేదు.. కొత్తగా అక్కడ సముదాయాలు నిర్మించలేని పరిస్థితి. ఈ క్రమంలో అలిపిరికి సమీపంలో వసతి సముదాయాలను నిర్మిస్తే ఇబ్బందులు లేకుండా పోతాయని భావిస్తున్నారు. అందుకే టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ వసతి సముదాయాలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు టీటీడీ అధికారులు. మొత్తం మీద టీటీడీ వసతి గదుల విషయంలో ఇబ్బందుల్ని తొలగించే పనిలో ఉంది.
