“..పైనే ఫినిష్‌.!గాల్లోనే పోతావ్.!!” నాడు వైఎస్..నేడు జ‌గ‌న్ పై బాబు

అంటూ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద చంద్ర‌బాబు చేసిన కామెంట్ల‌ను వైసీపీ సీరియ‌స్ గా తీసుకుంది. అంతేకాదు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అకాల మ‌ర‌ణం వెనుక బాబు కుట్ర ఉంద‌ని మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఆరోపించాడు.

  • Written By:
  • Updated On - November 26, 2021 / 06:44 PM IST

“గాల్లో తిరిగే నువ్వు గాల్లోనే పోతావ్..”

అంటూ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద చంద్ర‌బాబు చేసిన కామెంట్ల‌ను వైసీపీ సీరియ‌స్ గా తీసుకుంది. అంతేకాదు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అకాల మ‌ర‌ణం వెనుక బాబు కుట్ర ఉంద‌ని మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఆరోపించాడు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మాజీ సీఎం వైఎస్ పావురాల గుట్ట వ‌ద్ద మ‌ర‌ణించిన విష‌యం విదిత‌మే. ఆ సంఘ‌ట‌న మీద అప్ప‌ట్లో ప‌లు ర‌కాల క‌థ‌నాల‌ను మీడియా అల్లింది. సీబీఐ విచార‌ణ చేసింది. క్యుములో నింబ‌స్ మేఘాలను హెలికాప్ల‌ర్ ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింద‌ని తేల్చింది. ఆ సంద‌ర్భంగా బ్లాక్ బాక్స్ లో రికార్ట్ అయిన చివ‌రి మాట‌ల‌ను సీబీఐ అధ్య‌య‌నం చేసింది. వాస్త‌వాల‌ను బ‌య‌ట పెట్టింది.

కానీ, నిజాలు ఇప్ప‌టికీ బ‌య‌ట‌కు రాలేద‌ని వైఎస్ ఫ్యామిలీ న‌మ్ముతోంది. కొన్ని టీవీ ఛాన‌ళ్లు కూడా ఆనాడు జ‌రిగిన ప్ర‌మాదం వెనుక రిల‌యెన్స్ అధినేత అంబానీ ఉన్నాడ‌ని ఊద‌ర‌కొట్టాయి. వాటి మీద రిల‌యెన్స్ కేసులు కూడా వేసింది. వైఎస్ ఫ్యామిలీ కూడా రిల‌యెన్స్ మీద అనుమానాల‌ను వ్య‌క్తం చేసింది. అంతేకాదు, రాజ‌కీయ కోణం నుంచి చంద్ర‌బాబును కూడా సీన్లోకి లాగారు. ఒక ప్ర‌తికాధిప‌తి, చంద్ర‌బాబు, రిల‌యెన్స్ క‌లిసి వైఎస్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం చేయించార‌ని ఆనాడు జ‌గ‌న్ అండ్ టీం దుమ్మెత్తి పోసింది.


మ‌ళ్లీ ఇప్పుడు చంద్ర‌బాబు మీద మాజీ మంత్రి, ప్ర‌స్తుత వైసీపీ ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఆనాటి ఆరోప‌ణ‌ల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. జ‌గ‌న్ గురించి `గాల్లో తిరిగే నువ్వు గాల్లోనే పోతావ్‌..` అంటూ చేసిన వ్యాఖ్య‌లకు వైఎస్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి ముడిపెడ్డాడు. ఆనాడు హెలికాప్ల‌ర్ ప్ర‌మాదానికి ముందు రోజు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తున్నాడు. `పై నుంచి పైనే ఫినిష్‌..` అంటూ 2009 అక్టోబ‌ర్లో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశంలో వైఎస్ గురించి చంద్ర‌బాబునాయుడు మాట్లాడిన మాట‌ల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు.

ప్ర‌మాదానికి ఒక రోజు ముందు చంద్ర‌బాబు మాట‌ల‌ను పేప‌ర్లు బ్యాన‌ర్ ఐట‌మ్ గా `పైనుంచి పైనే ఫినిష్..` అంటూ ఇవ్వ‌డాన్ని ఇప్పుడు వైసీపీ ప‌రిశీలిస్తోంది. జ‌గ‌న్ మ‌ర‌ణాన్ని చంద్ర‌బాబు కోరుకుంటున్నాడ‌ని వైసీపీ ఫైర్ అవుతోంది. అందుకే, అలాంటి మాట‌లు మాట్లాడాడ‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. చిత్తూరు, క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాల్లో వ‌ర‌ద న‌ష్టాన్ని ప‌రిశీలించ‌డానికి వెళ్లిన చంద్ర‌బాబు చేసిన కామెంట్ల‌ను వైసీపీ సీరియ‌స్ గా తీసుకుంది.
వాస్త‌వంగా జ‌రిగిన న‌ష్టాన్ని చూసిన త‌రువాత ప్ర‌తిప‌క్ష‌నేత‌గా బాబుకు బాధ వేసింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ హెలికాప్ట‌ర్లో ఆకాశ మార్గాన ప‌రిశీలించి వెళ్ల‌డాన్ని త‌ప్పుబ‌ట్టాడు. క్షేత్ర‌స్థాయిలో బాధితుల‌ను ప‌రిశీలించ‌క‌పోవ‌డాన్ని ప్ర‌శ్నించాడు. ఆ క్ర‌మంలో `గాల్లో తిరిగే నువ్వు గాల్లోనే పోతావ్‌..` అంటూ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్య‌ల‌ను మృత్యు కోణం నుంచి వైసీపీ ఎంపీ మోపిదేవి చూస్తున్నాడు. అందుకే, వైఎస్ మ‌ర‌ణం ముందురోజు బాబు చేసిన కామెంట్ల‌ను గుర్తు చేసుకుంటూ..హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం వెనుక చంద్ర‌బాబు కుట్ర ఉంద‌ని ఆరోపించాడు.సోష‌ల్ మీడియాలోనూ చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై ట్రోల్స్ వేగం పుంజుకుంది. వాటికి తోడుగా వైసీపీ నేత‌లు వైఎస్ఆర్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం వెనుక కుట్ర కోణాన్ని బ‌య‌ట‌కు లాగుతున్నారు. ఆ క్ర‌మంలో మ‌ళ్లీ ఏపీలో ఎలాంటి రాజ‌కీయ బాంబ్ పేల‌నుందో చూద్దాం!