టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ (Paritala Sriram)పై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మకూరు మండలంలోని సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) తాజాగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకూరు సభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. ప్రజల మధ్య గొడవలు ప్రేరేపించేలా మాట్లాడారని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జొన్నగిరి బాలపోతన్న పోలీస్ స్టేషన్లో శ్రీరామ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదైంది.
Also Read: Chief Minister Jagan Mohan Reddy: ఎనిమిది మంది మృతికి చంద్రబాబే కారణం: సీఎం జగన్
ఈ సభలో మాజీ మంత్రి సునీత మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఎక్కడా అభివృద్ధి చేపట్టలేదని ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అప్పట్లో తాము నిర్మించిన రోడ్లు, బ్రిడ్జిలపైనే నిలబడి ఎమ్మెల్యే ప్రసంగిస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. పేరూరు జలాశయానికి నీరిచ్చేందుకు రూ.803 కోట్లు మంజూరు చేయించి పనులు చేపట్టామన్నారు. పేరూరు కాలువ పూర్తిచేసి, భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇప్పించాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి పరిటాల సునీతతో కలిసి బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పరిటాల శ్రీరామ్.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.దీంతో వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిటాల శ్రీరామ్ తో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్ పై 153ఏ, 505 కింద కేసు నమోదు చేశారు.