World Bank Warning : పాకిస్థాన్ కు ప్రపంచ బ్యాంకు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, విద్యుత్ చార్జీలతో దేశ ప్రజలు సతమతం అవుతున్నారని పేర్కొంది. కనీసం ఎన్నికల తర్వాత రాబోయే ప్రభుత్వమైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది. పాకిస్థాన్ లో సైనిక, రాజకీయ విధాన నిర్ణయాలు నేతల స్వార్థ ప్రయోజనాలతో ప్రభావితమవుతున్నాయని పాకిస్తాన్లోని ప్రపంచ బ్యాంకు యొక్క కంట్రీ డైరెక్టర్ నజీ బాన్హాస్సిన్ కామెంట్ చేశారు. పాకిస్థాన్ లో 40 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉందని గుర్తు చేశారు. ‘‘పాక్ లో ఏర్పడబోయే భావి ప్రభుత్వాలు వాటి పంథాను మార్చుకోకుంటే.. దేశం రానున్న కాలంలోనూ పేదరికంలోనే మగ్గే ముప్పు ఉంది’’ అని చెప్పారు.
సైనిక, రాజకీయ, వ్యాపారపరమైన స్వార్థ ప్రయోజనాలతో తీసుకునే విధాన నిర్ణయాల వల్లే పాక్ వెనుకబడి పోతోందని నజీ బాన్హాస్సిన్ అన్నారు. ఈ పద్ధతిని మార్చుకోకుంటే పాక్ ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే ముప్పు ఉందని ప్రపంచబ్యాంకు హెచ్చరిక చేసింది. పాకిస్థాన్లో పేదరికం గత ఏడాది వ్యవధిలో 34.2 శాతం నుంచి 39.4 శాతానికి పెరిగిందని, 1.3 కోట్ల మందికిపైగా ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని నజీ బాన్హాస్సిన్ చెప్పారు. దాదాపు 95 మిలియన్ల పాకిస్థానీయులు ఇప్పుడు పేదరికంలో (World Bank Warning) జీవిస్తున్నారని పేర్కొన్నారు.