అమెరికా-ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికే ఒప్పందం కుదిరే దశలో ఉన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒప్పంద ముసాయిదా తనకు నచ్చకపోతే ఇరాన్పై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. దీంతో ఇప్పటికే సున్నితంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులపై మరోసారి దృష్టి కేంద్రీకృతమైంది.
ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో కలిసి మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదరబోయే ఒప్పందం ఇంకా తుది రూపం దాల్చలేదని చెప్పారు. ప్రస్తుతం అది కేవలం అవగాహన ఒప్పందం మాత్రమేనని పేర్కొన్నారు.
‘‘ఆ ఒప్పందం నాకు నచ్చకపోతే మళ్లీ వారిపై కాల్పులు జరుపుతాం. వారి తలలపై బాంబులు వేయడం మొదలుపెడతాం’’ అంటూ ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రవర్తన సరిగా లేకపోయినా అదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు మళ్లీ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి
