Five Days In Rubble : జనవరి 1న జపాన్లో సంభవించిన భూకంపం వల్ల ఎంతటి విలయం చోటుచేసుకుందో మనందరికీ తెలుసు. ఈ భూకంపం వల్ల దాదాపు 150 మంది చనిపోయారు. వందలాది మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారు. 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. 250మంది ఆచూకీ తెలియడం లేదు. కూలిపోయిన భవనాల కింది నుంచి డెడ్ బాడీస్ను తొలగించే ప్రక్రియ నత్తనడకన జరుగుతోంది. జనవరి 1న భూకంపం చోటుచేసుకోగా.. జనవరి 5న ఓ భవనం శిథిలాల కింది నుంచి ఓ 90 ఏళ్ల బామ్మ బతికి బయటికి వచ్చింది. కూలిపోయిన ఒక భవనం వద్ద రెస్క్యూ వర్క్స్ చేస్తున్న సిబ్బంది.. శిథిలాల కింద సజీవంగా ఉన్న ఆ వృద్ధురాలిని గుర్తించి హుటాహుటిన పైకి లాగారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. భూకంప శిథిలాల్లో చిక్కుకున్న వారు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో 72 గంటల తర్వాత బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఐదు రోజుల తర్వాత కూడా 90 ఏళ్ల వృద్ధురాలు సురక్షితంగా బయటపడటం అందరికీ ఆశ్చర్యపరిచింది. నూకలు మిగిలి ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అనేందుకు ఇదే నిదర్శనమని స్థానికులు చెప్పుకున్నారు. కాగా, వాజిమా ప్రాంతానికి చెందిన 76 ఏళ్ల షిరో కొకుడా(Five Days In Rubble) అనే వ్యక్తి ఇంకా తన స్నేహితుల ఆచూకీ కోసం సహాయక కేంద్రాల వద్ద వెతుకుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
గత సోమవారం పశ్చిమ జపాన్లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మరోవైపు మంచు కూడా ఎక్కువగా కురుస్తోంది. దీనివల్ల భూకంపంతో ప్రభావితమైన ప్రాంతాలకు రెస్క్యూ టీమ్స్ చేరడం కూడా ఆలస్యమైంది. ఈ జాప్యం వల్ల తక్షణ చికిత్స అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక విద్యుత్ సరఫరా ఇంకా చాలాచోట్ల పునరుద్ధరణ కాలేదు. దీంతో ప్రజలు అంధకారంలో గడుపుతున్నారు. సెల్ టవర్లు చాలాచోట్ల కూలిపోవడంతో.. సెల్ఫోన్లను కూడా వినియోగించలేని దుస్థితిలో జనం కొట్టుమిట్టాడుతున్నారు. భూకంపం వల్ల ఇషికావా ప్రాంతంలో చాలా నష్టం జరిగింది.
Also Read: Kargil Historic : కార్గిల్పై హిస్టారికల్ నైట్ ల్యాండింగ్.. ఫీట్ విశేషాలివీ..
జపాన్లో ఒకేరోజు దాదాపు 155 ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత ధాటికి జపాన్ సముద్ర తీర ప్రాంతం రూపురేఖలు మారిపోయినట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. భూకంపం తరువాత కొత్త తీర ప్రాంతాలు ఏర్పడ్డాయి. తీరం వెంట భూమి ఎత్తు పెరిగిందని ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని చోట్ల భూమి 250 మీటర్ల నుంచి 820 అడుగుల మేర విస్తరించినట్టు టోక్యో విశ్వవిద్యాలయం నిపుణులు అంచనా వేశారు. ఇది దాదాపు 2 అమెరికన్ ఫుట్ బాల్ మైదానాలతో సమానమని, తీరం వెంట భూమి పెరగడాన్ని ‘అప్ లిఫ్ట్’ అని పిలుస్తారని చెప్పారు.