బాపట్ల జిల్లాలో రన్నింగ్ రైల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు జరిపారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు లక్ష్యంగా దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. రైలు బాపట్ల – అప్పికట్ల స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో.. నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించడానికి దుండగులు ప్రయత్నించారు. అయితే, ప్రయాణికులు అప్రమత్తమై దొంగలను ప్రతిఘటించి గట్టిగా కేకలు వేశారు. ప్రయాణికుల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో కంగుతిన్న దొంగలు, వెంటనే రైలు చైన్ లాగారు. రైలు ఆగగానే కిందకు దూకేశారు. రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి, పారిపోతున్న దుండగులపై కాల్పులు జరిపారు. చీకటి కావడంతో దొంగలు సులువుగా తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం రైల్వే పోలీసులు ఈ దోపిడీ ముఠా కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఏపీలో దొంగలు రెచ్చిపోయారు.. రన్నింగ్ రైల్లో చోరీకి తెగబడ్డారు, పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది. సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్కు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బాపట్ల శివారు నల్లమడ వాగు రైల్వే వంతెన దగ్గర ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో.. సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులోని ఎస్-3, ఎస్-6 బోగీల్లో చొరబడిన దొంగలు.. నిద్రపోతున్న ఇద్దరు మహిళల నుంచి ఏడు సవర్ల బంగారు ఆభరణాలు దొంగిలించారు.
వెంటనే మహిళా ప్రయాణికులు కేకలు వేయడంతో, కొందరు వెంటనే చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. దొంగలు రైలు నుంచి కిందకు దిగి పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రోడ్డు వైపు పరుగులు తీశారు. వెంటనే రైల్వే పోలీసులు అలర్ట్ అయ్యారు.. 9 రౌండ్ల కాల్పులు జరిపారు. చీకటి కావడంతో దొంగలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. సర్కార్ ఎక్స్ప్రెస్లో చోరీ గురించి జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావుకు సమాచారం అందింది. వెంటనే ఆయన స్థానిక పోలీసుల్ని అలర్ట్ చేశారు. దొంగల కోసం అప్పికట్ల-బత్తిపూడి పొలాల్లో గాలింపు చేపట్టారు. ఈ చోరీకి ఆరుగురు దొంగలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
మరోవైపు గత ఏప్రిల్ 19న వేకువజామున కూడా బాపట్ల జిల్లా అప్పికట్ల సమీపంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ రోజు బెంగళూరు – నర్సాపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్లో చోరీ జరిగింది. రైల్లో నిద్రిస్తున్న మహిళా ప్రయాణికుల మెడల్లో నుంచి 130 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. మూడు వారాల క్రితం బాపట్ల, గుంటూరు జిల్లాల సరిహద్దులో నిడుబ్రోలు దగ్గర దొంగలు సిగ్నల్స్ టాంపరింగ్ చేసి చోరీ చేయాలనుకున్నారు. రైల్వే పోలీసులు గమనించి వెంటనే అలర్ట్ అయ్యారు.. ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దొంగలు పారిపోయారు. దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో రెండు నెలల్లోనే వరుసగా మూడు చోరీలు జరగడం కలకలం రేపుతోంది.
