రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

సంభావ్య ముప్పులను దృష్టిలో ఉంచుకుని ఇస్లామాబాద్ నగరాన్ని అభేద్యమైన కోటగా మార్చారు. నగరం దక్షిణ, పశ్చిమ గగనతలంలో డిఫెన్స్ సిస్టమ్స్ (రక్షణ వ్యవస్థలను) పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
US- Iran

US- Iran

US- Iran: ఇస్లామాబాద్‌లో శనివారం ఇరాన్- అమెరికా మధ్య జరగనున్న కీలక శాంతి చర్చలకు ముందే వాతావరణం అత్యంత ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌పై ఒత్తిడిని పెంచుతూ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ‘న్యూయార్క్ పోస్ట్’తో మాట్లాడిన ఆయన అమెరికా తన “అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను” నౌకల్లో లోడ్ చేస్తోందని చెప్పారు. శాంతి చర్చలు విఫలమైతే అత్యాధునిక ఆయుధాలతో కూడిన నౌకలను పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్ భారీ హెచ్చరిక

ట్రంప్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) తర్వాత శాశ్వత ఒప్పందాన్ని కుదుర్చుకోవడం. ఈ చర్చల్లో యురేనియం సుసంపన్నత, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్, క్షిపణి కార్యక్రమం, ఇరాన్‌పై ఉన్న ఆంక్షల సడలింపు వంటి ప్రధానాంశాలు ఉన్నాయి. ఇరాన్ సముద్ర మార్గాల ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తోందని, ఒత్తిడిని పెంచేందుకు మాత్రమే ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. “ఇరాన్ సజీవంగా ఉందంటే అది కేవలం చర్చల కోసమే. ప్రపంచాన్ని బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం జరుగుతోంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read: చీర క్యాన్సర్ ఎలా వస్తుంది?

మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ స్పందిస్తూ.. తమ రెండు షరతులు నెరవేరనంత వరకు ఇరాన్ ముందుకు వెళ్లదని స్పష్టం చేశారు. ఆ షరతులు

లెబనాన్‌లో సీజ్‌ఫైర్‌ను అమలు చేయడం.

ఇరాన్‌కు చెందిన బ్లాక్ చేయబడిన ఆస్తులను విడుదల చేయడం.

ఇరాన్ షరతు.. అమెరికా స్పందన

ఇదే సమయంలో ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ కూడా టెహ్రాన్‌ను హెచ్చరించారు. అమెరికాతో “ఆటలు” ఆడవద్దని, తమ ఉద్దేశ్యం ఈ చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించడమేనని ఆయన అన్నారు. ఒకవైపు దౌత్యపరమైన పరిష్కార ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు కఠినమైన ప్రకటనలు, సైనిక ఒత్తిడి ఈ చర్చలు అత్యంత నిర్ణయాత్మక, సున్నితమైన దశకు చేరుకున్నాయని సూచిస్తున్నాయి.

గమనార్హం ఏమిటంటే.. పాకిస్థాన్ తన మిత్రదేశమైన చైనా సహాయంతో అమెరికా- ఇరాన్ మధ్య గత 40 రోజులుగా సాగుతున్న పోరాటాన్ని తాత్కాలికంగా ఆపేలా కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు పాకిస్థాన్ ఈ యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే దిశగా కొత్త చొరవ చూపుతోంది.

కోటలా మారిన ఇస్లామాబాద్

సంభావ్య ముప్పులను దృష్టిలో ఉంచుకుని ఇస్లామాబాద్ నగరాన్ని అభేద్యమైన కోటగా మార్చారు. నగరం దక్షిణ, పశ్చిమ గగనతలంలో డిఫెన్స్ సిస్టమ్స్ (రక్షణ వ్యవస్థలను) పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేశారు. ఈ మొత్తం పరిణామంలో పాకిస్థాన్ అంతర్జాతీయ ప్రతిష్ట కూడా ముడిపడి ఉంది. కాబట్టి భద్రత విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ ‘డాన్’ పత్రికతో మాట్లాడుతూ.. విదేశీ అతిథులందరికీ “ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ” కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పాకిస్థాన్ ఒకవైపు దౌత్యపరంగా శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు భద్రతా పరంగా పూర్తి అప్రమత్తంగా కనిపిస్తోంది.

  Last Updated: 10 Apr 2026, 11:40 PM IST