G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా జరిపిన సైనిక దాడుల్లో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం, నావికుల భద్రతను నిర్ధారించడం ప్రపంచ దేశాల సమష్టి బాధ్యత అని ఆయన గట్టిగా నొక్కిచెప్పారు. నిన్న‌ జరిగిన జీ7 అవుట్‌రీచ్ సెషన్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు […]

Published By: HashtagU Telugu Desk
Trump makes a sensational move at the G7 summit!

Trump makes a sensational move at the G7 summit!

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా జరిపిన సైనిక దాడుల్లో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం, నావికుల భద్రతను నిర్ధారించడం ప్రపంచ దేశాల సమష్టి బాధ్యత అని ఆయన గట్టిగా నొక్కిచెప్పారు.

నిన్న‌ జరిగిన జీ7 అవుట్‌రీచ్ సెషన్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. “ఆ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణల వల్ల మన మిత్ర దేశాలలో తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా, హ‌ర్మూజ్ జలసంధి గుండా జరిగే సముద్ర వాణిజ్యానికి అంతరాయం కలగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఈ ఘర్షణల కారణంగా పలువురు భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు” అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాలను వాణిజ్యపరంగా కలిపే నావికుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్‌కు సంబంధించిన ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తున్నాయన్న అనుమానంతో ఇటీవల కొన్ని వాణిజ్య నౌకలపై యూఎస్ సైనిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. జూన్ 9న ఒమన్ గల్ఫ్‌లో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘సెట్టెబెల్లో’ అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఆ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 24 మంది భారతీయులే. అంతకుముందు, జూన్ 8న 24 మంది భారతీయ సిబ్బందితో ఉన్న ‘మారివెక్స్’ అనే మరో నౌకపైనా దాడి జరిగింది. అయితే అందులోని సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. జూన్ 11న 20 మంది భారతీయులతో ఉన్న ‘జల్వీర్’ నౌకను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నౌకలేవీ భారత్‌కు చెందినవి కావు, విదేశీ జెండాలతో ప్రయాణిస్తున్నాయి.

ఈ దాడులపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ అధికారిని పిలిపించి తమ ఆందోళనను తెలియజేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధ్రువీకరించారు. “మా నావికా సమాజం సంక్షేమానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. ఈ దాడులను వెంటనే ఆపాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

ప్రపంచ చమురు, వాణిజ్య రవాణాలో హ‌ర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైనది. ఇక్కడ పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల విదేశీ నౌకలపై పనిచేస్తున్న భారతీయ నావికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. జీ7 సదస్సు వేదికగా ప్రధాని మోదీ ఈ అంశాన్ని లేవనెత్తడం, సముద్ర భద్రతకు, మధ్యప్రాచ్యంలో పనిచేస్తున్న ప్రవాస భారతీయుల రక్షణకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. సదస్సు ముగింపులో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.

  Last Updated: 17 Jun 2026, 08:55 AM IST