80 Earthquakes : గత అర్ధరాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే 80 సార్లు భూమి కంపించడంతో తైవాన్ దేశం వణికిపోయింది. భూకంపం కుదుపులు చోటుచేసుకున్న ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. రాత్రంతా రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ భూకంపాల ధాటికి కొన్ని భవనాలు పేకమేడల్లా కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు సమాచారం. అయితే ఎంత మంది చనిపోయారు ? ఎంతమంది గాయపడ్డారు ? అనేది తెలియాల్సి ఉంది. ప్రత్యేకించి ఈ భూకంపం ప్రభావం ప్రధానంగా తైవాన్ తూర్పు ప్రాంతంలో కనిపించింది.
We’re now on WhatsApp. Click to Join
సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు భూప్రకంపనలను(80 Earthquakes) ఫీల్ అయ్యామని ప్రజలు చెప్పుకొచ్చారు. తమ ఇళ్లు కదిలిపోయినట్లు.. వస్తువులన్నీ కదిలినట్లు .. స్పష్టంగా కనిపించిందని కథలు కథలుగా జనం వివరించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.భూకంప కేంద్రం హువాలిన్ నగరంలో ఉందని అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.3గా నమోదైందన్నారు.
ఏప్రిల్ 3న కూడా తైవాన్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూడా భూకంప కేంద్రం హువాలిన్ నగరంలోనే ఉందని వెల్లడవడం గమనార్హం. ఆ టైంలో భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. ఏకంగా పెద్ద భవనాలు, ఫ్లైఓవర్లు, వంతెనలు ఊగిపోయాయి. అయినా 14 మందే చనిపోయారు. రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉండడంతో తైవాన్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 1993లో తైవాన్లో చోటుచేసుకున్న భారీ భూకంపంలో 2వేల మంది చనిపోయారు. అప్పట్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. 2016లో ఆ దేశం దక్షిణ ప్రాంతంలో వచ్చిన భూకంపంలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు.