Donal Trump రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురుపై విధించిన ఆంక్షల విషయంలో అమెరికా ప్రభుత్వం అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆంక్షల నుంచి మినహాయింపును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో భారత్ సహా పలు దేశాలకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలను అదుపు చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ శుక్రవారం రాత్రి ఈ మేరకు కొత్త లైసెన్స్ను జారీ చేసింది. దీని ప్రకారం, రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలుకు 2026 మే 16 వరకు అనుమతి లభించింది. అయితే, కేవలం రెండు రోజుల క్రితమే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ మినహాయింపును పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం గమనార్హం. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం పూర్తి భిన్నమైన నిర్ణయం తీసుకుంది.
ఈ పొడిగింపు వల్ల భారతీయ రిఫైనరీలకు భారీ ఊరట లభించినట్లయింది. ఏప్రిల్ 17 నాటికి సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న (లోడ్ అయిన) రష్యా చమురును ఎలాంటి ఆంక్షల భయం లేకుండా భారత్ ఇకపై దిగుమతి చేసుకోవచ్చు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి వద్ద రవాణాకు అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ధరల ఒత్తిడిని తగ్గించి, మార్కెట్ను స్థిరీకరించేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
