ఇండోనేషియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ కాలిమంతన్ ప్రావిన్స్లో జరిగిన ఈ దుర్ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు. దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల మధ్య హెలికాప్టర్ శకలాలను అధికారులు గుర్తించారు.
జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం మెలావీలోని ఒక ప్లాంటేషన్ ఏరియా నుంచి టేకాఫ్ అయిన కేవలం ఐదు నిమిషాలకే ఎయిర్బస్ హెచ్130 హెలికాప్టర్తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం గాలింపు చర్యలు చేపట్టగా, గురువారం మధ్యాహ్నం 3:25 గంటల సమయంలో ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన సూపర్ ప్యూమా హెలికాప్టర్ మొదట శకలాలను గుర్తించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఇద్దరు సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. సహాయక బృందాలు ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశాయి. మరో మూడు మృతదేహాలు శకలాల్లోనే చిక్కుకోగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. చీకటి పడటం, భూభాగం అత్యంత కఠినంగా ఉండటంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. శుక్రవారం ఉదయం తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ హెలికాప్టర్ మాథ్యూ ఎయిర్ నుసంతారాకు చెందినది. చిత్ర మహకోట అనే పామాయిల్ కంపెనీకి చెందిన ప్లాంటేషన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
