Pak Missile Tests: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్పై భారత్ చాలా రకాల చర్యలు చేపట్టింది. ఎన్నో రకాల ఆంక్షలను విధించింది. వివిధ ఒప్పందాలను రద్దు చేసుకుంది. త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ కూడా భారత్ చేయనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ కీలక ప్రకటన విడుదల చేసింది.
Also Read :Gautam Gambhir: చంపేస్తామంటూ గౌతమ్ గంభీర్కు ఐసిస్ కశ్మీర్ బెదిరింపులు
కరాచీ తీరంలో మిస్సైల్ పరీక్షలు
ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ తీరం వద్దనున్న ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో మిస్సైల్ టెస్టులు చేస్తామని ఈరోజు పాక్ సర్కారు వెల్లడించింది. భూతలం నుంచి భూతలంపైకి వెళ్లే క్షిపణులతో ప్రయోగ పరీక్షలు చేస్తామని తెలిపింది. భారత్ దాడి చేస్తుందనే భయంతోనే పాకిస్తాన్ ఈ క్షిపణి పరీక్షలకు సిద్ధమైందని అంటున్నారు. కనీసం ఈ క్షిపణి పరీక్షలను చూసైనా.. దాడి ఆలోచనను భారత్ విరమించుకుంటుందని పాక్ భావిస్తోంది. ఈ క్షిపణి పరీక్షలు జరుగుతుండగా.. ఒకవేళ పాక్పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తే పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉంది. కరాచీ తీరం నుంచి పాకిస్తాన్ క్షిపణులను భారత్ దిశగా వదిలే ముప్పు లేకపోలేదు.
Also Read :India Vs Pak : ఢిల్లీలోని పాక్ హైకమిషన్కు షాక్.. కీలక చర్యలు
టార్గెట్ ముంబై, కచ్..
కరాచీ(Pak Missile Tests) నుంచి ముంబైకి గగనతల మార్గంలో కేవలం 874 కి.మీ దూరం ఉంది. కరాచీ నుంచి గుజరాత్లోని కచ్ తీరం 900 కి.మీ దూరంలో ఉంది. ఈ మార్గాల్లో మిస్సైళ్లను పాక్ ఎక్కుపెట్టే ముప్పు ఉంది. అందుకే ఈ ప్రాంతంలో భారత్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను మోహరించే అవకాశం ఉంది. ఇక కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో ముంబై నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసు బలగాలు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నాయి. నగరంలోని బీచ్లు, ఫైవ్ స్టార్ హోటల్స్, రైల్వే స్టేషన్లు, షాపింగ్ కేంద్రాలు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు.