Houthis Attack : పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలంటూ యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్రసముద్రంలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎర్ర సముద్రం మీదుగా భారత్కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ నౌకపైనా హౌతీలు మిస్సైల్ ఎటాక్ చేశారు. ఈ నౌకపైకి హౌతీలు మూడు యాంటీ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడి వల్ల నౌకకు స్వల్ప నష్టం వాటిల్లిందని గుర్తించారు. మరో నౌక ఎంవీ మైషాపైనా హౌతీలు మిస్సైళ్లతో ఎటాక్ (Houthis Attack) చేశారని.. దానికి కూడా నష్టం వాటిల్ల లేదని తెలిసింది. ఈవివరాలను అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.
We’re now on WhatsApp. Click to Join
ఆండ్రోమెడా స్టార్ నౌక వాస్తవానికి బ్రిటన్ దేశానికి చెందినది. అయితే ఇటీవల దీన్ని ఇజ్రాయెల్కు చెందిన ఓ కంపెనీకి విక్రయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీన్ని రష్యా , భారత్ మధ్య వాణిజ్య సేవల కోసం వాడుతున్నారు. చమురు నిల్వలతో కూడిన ఈ నౌక రష్యాలోని ప్రిమోర్స్క్ నగరం నుంచి భారత్లోని గుజరాత్లో ఉన్న వదినార్ పట్టణానికి వస్తున్నట్టు గుర్తించారు.
ఇజ్రాయెల్ దాడులతో అల్లాడుతున్న సామాన్య పాలస్తీనా పౌరులకు మద్దతుగా తాము ఈ దాడులు చేస్తున్నామని హౌతీ ప్రతినిధి యహ్యా సరియా వెల్లడించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. తాము కూడా ఎర్ర సముద్రంలో దాడులను ఆపుతామని స్పష్టం చేశారు. పనామా జెండాతో ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న ఓ నౌకపై తాము దాడి చేశామని ఆయన వెల్లడించారు. మరిన్ని దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ, సామరస్య సాధన దిశలో ఈజిప్టు మరో ముందడుగు వేసింది. ఈజిప్టు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఒకటి ఇజ్రాయెల్కు చేరుకుంది. హమాస్ ఇజ్రాయెల్ నడుమ కీలకమైన శాంతి ఒప్పందం దిశలో తాము మధ్యవర్తిత్వంలో ఉన్నామని, తమ ప్రయత్నాలు ఫలిస్తాయని విశ్వసిస్తున్నామని ఈజిప్టు ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తక్షణ శాంతిని తాము కోరుకుంటున్నామని తెలిపారు. తమ దేశ సరిహద్దుల్లోని గాజా ప్రాంతపు రఫా సిటీపై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్ను కోరారు. ఒకవేళ రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే పరిస్థితులు అదుపు తప్పొచ్చని హెచ్చరించారు. ఈజిప్టుకు చెందిన ఇంటలిజెన్స్ ఉన్నతాధికారి అబ్బాస్ కమెల్ ఈ ప్రతినిధి బృందానికి సారధ్యం వహిస్తున్నారు.