మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు చల్లార్చే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ ఒప్పందం “శాశ్వతంగా” నిలవాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత, హిజ్బుల్లా ప్రతినిధులతో జరిపిన పరోక్ష చర్చల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, ఇరుపక్షాలు దాడులను పూర్తిగా నిలిపివేస్తాయి. ఇజ్రాయెల్ తన సైన్యాన్ని బీరుట్ వైపు ముందుకు పంపబోదని హామీ ఇచ్చింది. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్రంప్ వివరాలు పంచుకున్నారు. “ఇజ్రాయెల్ తమపై దాడి చేయదని, తాము కూడా ఇజ్రాయెల్పై దాడి చేయబోమని హిజ్బుల్లా ప్రతినిధులు అంగీకరించారు. ఇది ఎంతకాలం నిలుస్తుందో చూద్దాం.. శాశ్వతంగా ఉండాలని ఆశిస్తున్నా!” అని ఆయన పోస్ట్ చేశారు.
ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్లోకి చొచ్చుకెళ్లగా, హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేసింది. గత ఒప్పందాలు పదేపదే ఉల్లంఘనకు గురవుతున్న నేపథ్యంలో తాజా ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రతిపాదనకు హిజ్బుల్లా అంగీకారం తెలిపిందని లెబనాన్ అధికారులు ధ్రువీకరించారు. అయితే, నెతన్యాహు కార్యాలయం ఈ చర్చలను ధ్రువీకరిస్తూనే, తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే స్పందించే హక్కు తమకుందని స్పష్టం చేసింది. ఈ విషయంపై హిజ్బుల్లా నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
