అమెరికాలోని తెలుగువారికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండగలగడం తన జీవితానికి దక్కిన మహాభాగ్యమని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులలో చేయగల ప్రజాసేవ కంటే ప్రవాసాంధ్రులకు సేవలందించగల ఈ పదవి ఎంతో తృప్తి ఇస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతంగా మెలగుతానని చెప్పారు. డల్లాస్ లో ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోమటి జయరాం కు ఆత్మీయ అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జయరాం మాట్లాడుతూ మాతృభూమి రుణం తీర్చుకోవడంలో విశిష్ట పాత్ర పోషిస్తున్న ప్రవాసాంద్ర తెలుగు వారి సేవలను ప్రత్యేకంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి ప్రవాసాంధ్రులకు ఎలాంటి అవసరాలు ఉన్నా వాటిని తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులు వర్చువల్ విధానంలో ప్రసంగించారు.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అమెరికాలోని తన వంటి అనేకమంది తెలుగువారికి జయరాం గురువుతో సమానమని కొనియాడారు. ఎన్నికలకు పూర్వం తెలుగుదేశం పార్టీ తరపున ఆయనతో కలిసి తాను కూడా అమెరికా అంతటా పర్యటించానని గుర్తు చేసుకున్నారు. అమెరికాలోని మారుమూల ప్రాంతాలతో సహా ప్రతి రాష్ట్రంలోని తెలుగువారితో ఇంతటి విస్తృత పరిచయాలు ఉన్న వ్యక్తి మరొకరు లేరు అని పెమ్మసాని కితాబిచ్చారు. జయరాం ఎన్ఆర్ఐలు అందరికీ నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అని, నిజానికి ఆయన కార్యదీక్ష సమర్థతలకు ఈ పదవి చాలా చిన్నదని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ జయరాం కోమటి బోళామనిషి అని, రాష్ట్రంలో ఎంతోమంది పార్టీ నాయకులకు పైకి కనపడకుండానే జయరాం ఎంతో మద్దతు అందించారని, అండగా నిలిచారని వివరించారు.
