Tariff: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలపై వేర్వేరు టారిఫ్లను (దిగుమతి సుంకాలు) విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ తీసుకున్న ఈ టారిఫ్ నిర్ణయాన్ని అక్కడి సుప్రీంకోర్టు అక్రమమని తేల్చింది. ఇటీవల భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్పై టారిఫ్ను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అమెరికా కోర్టు తీర్పు నేపథ్యంలో భారత్ అసలు ఎంత టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది అనే సందేహాలు మొదలయ్యాయి.
భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం మార్చి 2026 నాటికి ఖరారు అయ్యే అవకాశం ఉంది. అమెరికా కోర్టు తీర్పు తర్వాత, అధ్యక్షుడు ట్రంప్ గ్లోబల్ 10 శాతం కొత్త టారిఫ్ను ప్రకటించారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. దీని ప్రకారం.. ఇప్పుడు భారత్పై 18 శాతానికి బదులుగా 10 శాతం టారిఫ్ వర్తిస్తుంది.
ఈ నెల ప్రారంభంలో భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరినప్పుడు రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధించిన 25 శాతం శిక్షాత్మక సుంకాన్ని ట్రంప్ రద్దు చేశారు. రష్యా నుండి నేరుగా లేదా పరోక్షంగా ఇంధన దిగుమతులను నిలిపివేసి, అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని భారత్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
Also Read: సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు!
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ఏమన్నారు?
ట్రంప్ ప్రకటన ప్రకారం.. 150 రోజుల కాలపరిమితి వరకు అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల విలువపై 10 శాతం దిగుమతి సుంకం విధించబడుతుంది. శుక్రవారం (ఫిబ్రవరి 20, 2026) వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో కోర్టు తీర్పు తర్వాత కూడా భారత్తో కుదుర్చుకున్న ఒప్పందం కొనసాగుతుందా అని ప్రశ్నించగా.. “ఏమీ మారదు, భారత్ సుంకం చెల్లించాల్సిందే” అని ట్రంప్ సమాధానమిచ్చారు. అయితే చట్టపరంగా భారత్పై ప్రస్తుతానికి 10 శాతం టారిఫ్ మాత్రమే ఉంటుందని వైట్ హౌస్ తర్వాత స్పష్టం చేసింది.
అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ ప్రకటన
వైట్ హౌస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఉన్న అన్ని దేశాలపై ప్రస్తుతం తాత్కాలికంగా 10 శాతం టారిఫ్ అమలులో ఉంటుంది” అని తెలిపారు. అయితే కొన్ని ప్రత్యేక వస్తువులపై పాత నిబంధనలే కొనసాగుతాయి.
స్టీల్, అల్యూమినియం: సెక్షన్ 232 కింద 50 శాతం టారిఫ్.
ఆటో పార్ట్స్: కొన్ని విడిభాగాలపై 25 శాతం టారిఫ్.
ఈ అంశంపై మరింత స్పష్టత కోసం భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం వచ్చే వారం వాషింగ్టన్ డిసికి వెళ్లే అవకాశం ఉంది.
