Sonam Wangchuk : లడఖ్కు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే డిమాండ్తో సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణవేత్త, రామన్ మెగసేసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వైద్య పరీక్షలలో ఆయన రక్తపోటు (BP), రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar) సాధారణంగానే ఉన్నట్లు తేలింది. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన నిరంతరాయంగా చేసిన ఉపవాసం, శారీరక ఒత్తిడి కారణంగా ఒంట్లో నీరసం ఆవహించి తీవ్రంగా బలహీనపడ్డారని హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆయనకు నిర్వహించిన రక్త పరీక్షల (Blood Tests) ఫలితాల్లో కొన్ని కీలక పారామీటర్లలో స్వల్ప తేడాలు వచ్చినట్లు గుర్తించామని, వాటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతర వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు.
సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలింపు.. లడఖ్ ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక భద్రత
ఢిల్లీ వేదికగా సాగుతున్న ఆందోళనల క్రమంలో సోనమ్ వాంగ్చుక్ శారీరక స్థితి క్షీణించడంతో, నిన్ననే అధికారులు ఆయన చేత నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమింపజేశారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయన్ను ఢిల్లీలోని ప్రతిష్టాత్మక విఎంఎంసి మరియు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి (VMMC & Safdarjung Hospital) తరలించారు. అక్కడ ప్రత్యేక నిపుణుల బృందం ఆయనకు సెలైన్లు, అవసరమైన మందులు అందిస్తూ చికిత్స అందిస్తోంది. లడఖ్ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలంటూ వాంగ్చుక్ బృందం చేపట్టిన పాదయాత్ర, ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చికిత్స పొందుతున్న సఫ్దర్జంగ్ ఆసుపత్రి వద్ద ఢిల్లీ పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.
