MP Asaduddin Owaisi: లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. పీఓకే అంశంపై స్పందించారు. పీఓకే(POK) భారత్లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని అన్నారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోంది? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పీవోకే గురించి పదేపదే మాట్లాడుతున్నారని… ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు వారేం చేశారో చెప్పాలని నిలదీశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, 400 స్ధానాలకు పైగా గెలుస్తామని ప్రారంభంలో చెప్పినట్లుగా ఇప్పుడు బీజేపీ చెప్పడం లేదన్నారు. పెట్రోల్ ధరలు రూ.100 దాటాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) బరిలో ఉన్న వారణాసిలో పేపర్ లీక్ల ఘటనల వంటి వాస్తవ అంశాలను బీజేపీ మరుగునపడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
అంతేకాక కాంగ్రెస్ గెలిస్తే అయోధ్య రామమందిరానికి(Ayodhya Ram Mandir) తాళం వేస్తోందన్న మోడీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నోట్ల రద్దు సమయంలో తాళాలు పడ్డ ఫ్యాక్టరీల గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తుచేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో యూపీకి చెందిన వారు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని… చాలా మంది చనిపోయారని… కానీ ఆయన వాటి గురించి మాట్లాడరని ఎద్దేవా చేశారు.