Bengal : శుక్రవారం నుంచి పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈరోజు కూడా మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి.. రోడ్లను దిగ్భందించారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై వారు రాళ్లతో దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. దీంతో 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు.
Read Also: AP Inter Results 2025 : ఆ కాలేజీలో అందరూ ఫెయిల్..ఎందుకని ?
ఘర్షణ సమయంలో ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో గాయపడిన 10మంది పోలీసులు.. ఓ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. హింసాత్మక చర్యలు నెలకొంటున్న నేపథ్యంలో ముర్షిదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించామని.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వదంతులను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. పరిస్థితిని అదుపు చేయడంలో మమత ప్రభుత్వం విఫలమయ్యిందని పేర్కొంది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని.. సమాజంలోని ఇతర వర్గాలలో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నాలని మండిపడింది. దీనిని అదుపులోకి తీసుకురావడానికి అవసరమయితే కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించింది.
కాగా, వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయితే వక్ఫ్ చట్టం పై సీఎం మమతా బెనర్జీ ఇటీవల స్పందించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలుచేయబోమని ప్రకటించారు. ఒకప్పుడు బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశం కలిసి ఉండేవని.. తర్వాతే విభజన జరిగిందని మమతా బెనర్జీ గుర్తు చేశారు. ఇక్కడే ఉండిపోయిన మైనారిటీలకు రక్షణ కల్పించడం మన బాధ్యత అని తాను ఉన్నంతకాలం వారిని, వారి ఆస్తులను రక్షిస్తానని మమతా బెనర్జీ అన్నారు.
Read Also: CM Chandrababu : వనజీవి రామయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం