753 Crores In Account : అతడు ఒక సాధారణ ఫార్మసీ ఉద్యోగి. అయితేనేేం నిజాయితీలో ఘనుడు!! తమిళనాడులోని చెన్నై సిటీ పరిధిలో తేనంపేటలో ఉన్న ఓ మెడికల్ షాపులో మహ్మద్ ఇద్రిస్ పనిచేస్తున్నాడు. శనివారం రోజు అతడు తన కోటాక్ మహీంద్రా బ్యాంకు అకౌంట్ నుంచి ఓ స్నేహితుడికి రూ.2వేలు, మరో మిత్రుడికి వంద రూపాయలను ఫోన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ వెంటనే తన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకున్న ఇద్రిస్ అవాక్కయ్యాడు. తన ఖాతాలో రూ. 753 కోట్ల 44 లక్షల బ్యాలెన్స్ ఉందని తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యాడు.అతడు నిజాయతీగా వ్యవహరించి వెంటనే బ్యాంకుకు కాల్ చేసి సమాచారం అందించాడు. దీంతో బ్యాంకువాళ్లు అతడి అకౌంట్ ను సీజ్ చేసి, అమౌంట్ ను వెనక్కి తీసుకున్నారు. తన అకౌంట్లోకి పెద్దఎత్తున అమౌంట్ వచ్చిందని, చివరకు తన ఖాతాను సీజ్ చేశారని ఆ యువకుడు మీడియా దృష్టికి తీసుకు రావడంతో తాజా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
తమిళనాడులో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఇది మూడోసారి. గతంలో చెన్నైకు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజ్కుమార్ తన తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఖాతాలో రూ. 9వేల కోట్లు డిపాజిట్ అయినట్టు గుర్తించాడు. అతడు బ్యాంక్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ పరిస్థితిని చక్కదిద్ది, అదనపు మొత్తాన్ని విత్డ్రా చేసింది. ఇక తంజావూర్కు చెందిన గణేశన్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో రూ. 756 కోట్లు జమ కావడంతో (753 Crores In Account) ఆశ్చర్యపోయాడు. అతడు కూడా బ్యాంకుకు సమాచారం ఇచ్చి.. అమౌంట్ వెనక్కి వెళ్లేలా సహకరించాడు.