Rajnath Singh : పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి గట్టి ప్రతీకారం తీర్చుకున్నామని, భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” ద్వారా దేశ సంకల్పాన్ని మరోసారి ప్రపంచానికి చాటామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ భారత సైనిక పరాక్రమానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పాక్ ఆధారిత ఉగ్రవాదానికి ఇది ఘాటైన జవాబని, భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించదని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Murali Nayak : మురళీనాయక్ శవపేటిక మోసిన మంత్రి లోకేశ్
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులకు ప్రతి దఫా భారత్ బలమైన ప్రతిస్పందన ఇచ్చిందని, యూరి, పుల్వామా, ఇప్పుడు పహల్గామ్ ఘటనల అనంతరం ప్రతిసారి భారత శక్తిని ప్రపంచం ముందు ఉంచామన్నారు. ఈసారి కేవలం సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా రావల్పిండి వంటి ప్రాధాన్యత గల ప్రదేశాలపై కూడా మన దాడులు కొనసాగాయని వెల్లడించారు. ఇది కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమేనని, పాక్ పౌరులపై దాడులు జరగలేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
ఫేక్ న్యూస్కు లోనవ్వకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. భారత దాడుల లక్ష్యం ఉగ్రవాదులే అని, పాకిస్తాన్ దేవాలయాలు, గురుద్వారాలపై దాడులు చేసిన దేశమని గుర్తు చేశారు. భారత్ మాత్రం ఎప్పుడూ నియమ నిబంధనలు పాటిస్తూ, లక్ష్యాన్ని కచ్చితంగా గుర్తించి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టడం వల్ల ఉగ్రవాదంపై గట్టి సంకేతం వెళ్లిందని రాజ్నాథ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి శక్తులనైనా భారత్ తగిన విధంగా ఎదుర్కుంటుందన్నారు.
Read Also: Ambanis Mango Empire: రిలయన్స్ మామిడి సామ్రాజ్యం.. 600 ఎకరాల్లో 1.30 లక్షల మ్యాంగో ట్రీస్