Site icon HashtagU Telugu

Terrorist Attack : ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ

National Security Advisor Ajit Doval meets Prime Minister Modi

National Security Advisor Ajit Doval meets Prime Minister Modi

Terrorist Attack : పెహల్‌గామ్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశ ప్రజలు ఆగ్రహంతో ఉలిక్కిపడుతున్నారు. ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన పాకిస్థాన్‌పై భారత్‌ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఢిల్లీలో కీలక భేటీలు జరుగుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ ప్రధానిని కలిసి, పెహల్‌గామ్‌ ఘటనపై సమీక్ష నిర్వహించారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

Read Also: APPSC Irregularities : ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ధాత్రి మధు అరెస్టు.. ఏమిటీ కేసు ?

కేంద్ర హోంశాఖ కూడా కీలక సమావేశం నిర్వహించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు మే 7న (బుధవారం) మాక్‌డ్రిల్‌ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిన్న కేంద్రహోం శాఖ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఇ, ప్రధాని వరుస భద్రతా సమీక్షలతో మమేకమవుతున్నారు. గత వారం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ మోడీతో సమావేశమవగా, నిన్న రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ కూడా ప్రధాని భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలు త్రివిధ దళాలకు ఉత్తరాల రూపంలో స్పష్టమైన సంకేతాలు అందిస్తున్నాయి.

గత నెల 26న నిర్వహించిన ఉన్నత స్థాయి రక్షణ సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ, సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు, రక్షణ రంగంలో చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు తన ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా రక్షణ తయారీ విభాగం సిద్ధంగా ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. సరిహద్దుల్లో అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచారు. పెహల్‌గామ్‌ ఘటన భారత భద్రతా రంగాన్ని మేల్కొల్పగా, పాకిస్థాన్‌పై కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలు సమకాలీన రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంది.

Read Also: Mahanadu 2025 : ‘మహానాడు’కు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావుకు ఆహ్వానం