PM Modi : భారత్‌ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది: ప్రధాని మోడీ

ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఘనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. ప్రజాస్వామ్యం మన ప్రాథమిక విలువల్లో ఒకటి. అది ప్రజల మధ్య చర్చకు ఆస్కారం కల్పిస్తుంది, ఐక్యతను పెంపొందిస్తుంది, గౌరవాన్ని బలపరుస్తుంది, మానవ హక్కులను ప్రోత్సహిస్తుంది అని అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Indian Government

Indian Government

PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఘనా పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం ప్రపంచ ప్రజాస్వామ్య విలువలకు చక్కటి ఉదాహరణగా నిలిచింది భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అంటూ ఆయన చేసిన వ్యాఖ్య సభలో ఉత్సాహం కలిగించింది. ఘనా పార్లమెంట్‌లో ప్రసంగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఘనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. ప్రజాస్వామ్యం మన ప్రాథమిక విలువల్లో ఒకటి. అది ప్రజల మధ్య చర్చకు ఆస్కారం కల్పిస్తుంది, ఐక్యతను పెంపొందిస్తుంది, గౌరవాన్ని బలపరుస్తుంది, మానవ హక్కులను ప్రోత్సహిస్తుంది అని అన్నారు. ఆయన హిందీలో మాట్లాడుతూ, “హమారే లియే లోక్తంత్ర వ్యవస్థ నహీ, సంస్కార్ హై,” అని పేర్కొన్నారు. దీని అర్థాన్ని ఆయన ఆంగ్లంలో కూడా వివరించారు. “For us, democracy is not just a system, it is a part of our culture.”

Read Also: Covid Vaccine : కోవిడ్ వ్యాక్సిన్‌లపై ఆరోపణలపై స్పందించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌

ప్రధాని మోడీ ప్రసంగంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క బలాన్ని, విస్తృత వైవిధ్యాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. భారతదేశంలో 2,500 పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయని, అందులో సుమారు 20 వేర్వేరు పార్టీలు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయని వివరించారు. ఈ ప్రకటనపై ఘనా పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యంతో స్పందించగా, సభలో చిరునవ్వులు చిందించాయి. సభాపతి అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ మోడీ పేర్కొన్న 2,500 పార్టీలు అనే అంశాన్ని మళ్లీ ప్రస్తావించడంతో సభలో హాస్య వాతావరణం ఏర్పడింది. భారత ప్రజాస్వామ్య వైవిధ్యాన్ని వివరించారు. భారతదేశం అంతటా 22 అధికారిక భాషలు ఉన్నాయి. వేలాది మాండలికాలు మాట్లాడతారు. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు కలగలసిన దేశమిది. ఇది ప్రజాస్వామ్యానికి బలాన్ని ఇస్తుంది అని పేర్కొన్నారు. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వమే భారత ప్రజాస్వామ్య విజయానికి కారణమని ఆయన వివరించారు.

ఇంకా భారతదేశం ఇతర దేశాల నుండి వచ్చిన వారిని హృదయపూర్వకంగా స్వీకరించే సహజ స్వభావాన్ని కలిగి ఉంది. అందుకే భారతీయులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా స్థానికులతో సులభంగా కలిసిపోతారు అని అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన భారత సంస్కృతిలో అంతర్నిహితమైన సహనాన్ని, సహజ అన్వయ సామర్థ్యాన్ని తెలియజేశారు. ఘనా పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య విలువలకు భారతదేశం ఇచ్చే ప్రాధాన్యతను నొక్కిచెప్పింది. ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆదర్శంగా నిలుస్తోందని, ప్రజాస్వామ్యానికి మద్దతు తెలిపే దేశంగా భారత పాత్ర మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటోందని ఈ సందేశం ద్వారా స్పష్టం అయింది.

Read Also: USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి!

 

 

 

  Last Updated: 03 Jul 2025, 06:02 PM IST