ED and 100crore: 3 నెలల్లో 100 కోట్లు సీజ్ చేసిన ఈడీ.. ఆ డబ్బును ఏం చేస్తారో తెలుసా?

ఒక కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.100 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత మూడు నెలల్లో దేశవ్యాప్తంగా సోదాల్లో స్వాధీనం చేసుకుంది.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 08:10 AM IST

ఒక కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.100 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత మూడు నెలల్లో దేశవ్యాప్తంగా సోదాల్లో స్వాధీనం చేసుకుంది.
ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్ము ఏమవుతుంది? వివిధ కేసుల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుంటుంది సరే, మరి ఆ సొమ్మును ఏం చేస్తుంది? అదేమవుతుంది? అన్న ప్రశ్న అందరినీ వేధిస్తూ ఉంటుంది. ఇందుకు సమాధానం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

అవకాశం ఇస్తారు..

నిజానికి స్వాధీనం చేసుకున్న సొమ్మును ఈడీ తన వద్ద ఉంచుకోదు. ప్రొటోకాల్ ప్రకారం.. సొమ్మును ఈడీ స్వాధీనం చేసుకున్న తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పేందుకు నిందితుడికి అవకాశం ఇస్తారు. దీనికి అతడు సరైన సమాధానం చెప్పడంలో విఫలమైనా, అతడు చెప్పిన సమాధానంతో అధికారులు సంతృప్తి చెందకున్నా అది అక్రమ సంపాదనగానే భావిస్తారు.

దోషిగా తేలితేనే..

మనీలాండరింగ్ చట్టం కింద నగదును స్వాధీనం చేసుకున్న వెంటనే ఈడీ అధికారులు ఆ విషయాన్ని భారతీయ స్టేట్‌బ్యాంకు అధికారులకు తెలియజేసి డబ్బులు లెక్కించమని కోరుతారు. డబ్బు లెక్కింపు పూర్తయ్యాక బ్యాంకు అధికారుల సమక్షంలోనే ఎంత స్వాధీనం చేసుకున్నదీ జాబితా తయారు చేస్తారు. ఇందులో స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం విలువ, రూ. 2000 నోట్లు ఎన్ని? రూ. 500  నోట్లు ఎన్ని? రూ. 100 నోట్లు ఎన్ని అన్న వివరాలను రాస్తారు. ఆ తర్వాత ఓ స్వతంత్ర సాక్షి సమక్షంలో ఓ పెట్టెలో ఆ మొత్తాన్ని ఉంచి సీల్ వేస్తారు. ఆ తర్వాత స్టేట్ బ్యాంకుకు ఈడీ పంపి..నిందిత వ్యక్తి డిపాజిట్ (PD) కింద జమ చేస్తుంది. అంటే అది కేంద్ర ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. అయితే, ఈ డబ్బును ఈడీ కానీ, బ్యాంకు కానీ, ప్రభుత్వం కానీ ఉపయోగించ కూడదు. అటాచ్‌మెంట్ నిర్ధారణ తర్వాత ఆయా కేసులో విచారణ ముగిసే వరకు డబ్బు బ్యాంకులోనే ఉంటుంది. నిందితుడు దోషిగా కనుక తేలితే ఆ సొమ్ము కేంద్రం ఆస్తిగా మారుతుంది. నిర్దోషిగా బయటపడితే మాత్రం ఆ సొమ్మును తిరిగి అతడికే అప్పగిస్తారు.

వరుస రైడ్స్.. వంద కోట్లు..

* వివిధ కేసులకు సంబంధించి జరిపిన సోదాల్లో దాదాపు రూ. 100 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.
* తాజాగా కోల్‌కతాలో ఓ మొబైల్ గేమింగ్ అప్లికేషన్ నిర్వాహకుడి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 17 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును 8 మంది బ్యాంకు అధికారులను కౌంటింగ్ మిషన్లతో లెక్కించారు.
* పశ్చిమ బెంగాల్ బహిష్కృత మంత్రి పార్థా ఛటర్జీ , ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.50 కోట్లు ఈడీ చరిత్రలోనే అత్యధికం.టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ సోదాలు నిర్వహించి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. కొండలా గుట్టలుగా పడివున్న ఈ సొమ్మును లెక్కించేందుకు అధికారులకు 24 గంటలు పట్టింది.
* జార్ఖండ్ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి రూ. 20 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.