CM Revanth Reddy to visit Delhi : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ ప్రమాణం చేసిన తర్వాత.. సీఎం, పీసీసీ అధ్యక్షుడు కలిసి ఢిల్లీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలువనున్నట్టు పేర్కొన్నారు.
కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై పార్టీ అధిష్ఠానం కసరత్తు..
ఈ పర్యటనలో పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి స్పష్టత కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా చర్చించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి, కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై పార్టీ అధిష్ఠానం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. ఇటీవలే అధ్యక్షుడిని నియమించారు. సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది.
Read Also: Budameru Floods Effect : చిరు వ్యాపారుల బతుకులు రోడ్డుపాలు చేసిన బుడమేరు
మరోవైపు ఈరోజు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం పెద్దలను కలిసి తనను పీసీసీ చీఫ్గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. అనంతరం ఈ నెల 15వ తేదీన నిర్వహించే తన పదవీ బాధ్యతల స్వీకారానికి రావాలని వారిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర ముఖ్యనేతలను కలిసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గీల సమాచారం.