Bandi Sanjay: మాజీ సీఎం కేసీఆర్(KCR)పై బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ(PM Modi)తనను అరెస్టు చేయించి జైలుకు పంపేందుకు ప్రయత్నించారని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ మాట్లాడుతూ..కేసీఆర్ మరో కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతిని బీజేపీ ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించిన బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని బండి సంజయ్ ఆరోపించారు. ఇక్కడి డబ్బులు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ డబ్బులు ఢిల్లీ మద్యంలో పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణేనికి బొమ్మ, బొరుసుగా ఉన్నాయని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి చేయకపోతే సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లేనన్న బండి సంజయ్ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.