Stadium Stampede : ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఎల్ సాల్వడార్ దేశ రాజధాని శాన్ సాల్వడార్ లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. అలియాన్జా ఎఫ్సీ, క్లబ్ డిపోర్టివో ఎఫ్ఏఎస్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియంకు(Stadium Stampede) చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది.
ALSO READ : Anand Mahindra: వామ్మో.. సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఫుట్ బాల్ స్టేడియం.. ఫొటోస్ వైరల్?
ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. తొక్కిసలాట నేపథ్యంలో వెంటనే గేమ్ ఆపేశారు. అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ స్టేడియం కెపాసిటీ 44 వేల మంది. అయితే శనివారం జరిగిన మ్యాచ్లో రెండు టీమ్స్ కూడా హాట్ ఫెవరేట్ కావడంతో.. పరిమితికి మించిన సంఖ్యలో అభిమానులు స్టేడియంకు వచ్చారు. ఇందువల్లే తొక్కిసలాట జరిగి ఉండొచ్చని అంటున్నారు. కస్కట్లాన్ స్టేడియంలో జరిగిన సంఘటనలపై సాల్వడోరన్ ఫుట్బాల్ ఫెడరేషన్ విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. ఈ ఘటనపై విచారణ నివేదికను కోరినట్టుగా వెల్లడించింది.