Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని, తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ వారి అయ్య జాగీరా’ అంటూ మండిపడ్డారు. ఎవరు ఏం అన్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తనకు ప్రేమ ఈ రోజు వచ్చిందని కాదు.. ఎప్పటినుంచో ఉందని తేల్చి చెప్పారు. రాజకీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైందని పేర్కొన్నారు. ఇక తాను చెరువులను కబ్జా చేసినట్లు చేసిన ఆరోపణలను కూడా […]

Published By: HashtagU Telugu Desk
Janasena will contest in Telangana.

Janasena will contest in Telangana.

తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని, తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ‘తెలంగాణ వారి అయ్య జాగీరా’ అంటూ మండిపడ్డారు. ఎవరు ఏం అన్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తనకు ప్రేమ ఈ రోజు వచ్చిందని కాదు.. ఎప్పటినుంచో ఉందని తేల్చి చెప్పారు. రాజకీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైందని పేర్కొన్నారు. ఇక తాను చెరువులను కబ్జా చేసినట్లు చేసిన ఆరోపణలను కూడా ఖండించారు.

జనసేన పార్టీ తలపెట్టిన సభ రద్దు కావడంతో.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో తాను ఎలా తిరుగుతానో చూస్తామంటూ చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారని.. తెలంగాణ కోసం తాను పోరాటాలు చేసినప్పుడు ఈ నాయకులంతా ఎక్కడికి పోయారు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ‌ను తెలంగాణకు రానివ్వం అంటున్నారని.. ఇదేమైనా మీ అయ్య జాగీరా అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. తనను బెదిరించడానికి మీరు ఎవరు అని ప్రశ్నించారు. తనను ఎంత తిట్టినా పట్టించుకోనని.. తనకు తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే బెదిరింపులు ఎక్కువ అని చెప్పారు. భయపడే వాళ్లమే అయితే రాజకీయ పార్టీని పెడతామా అని పేర్కొన్నారు.

తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టిందని.. హైదరాబాద్ నడిబొడ్డున పార్టీ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. తెలంగాణకు జనసేన పార్టీ వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణలో లక్ష మంది జనసైనికులు ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణపై తనకు ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు, సంస్కృతికి జనసేన పార్టీ వ్యతిరేకం కాదని తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్.. కానీ విభజించిన తీరుకు మాత్రమే తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. పార్లమెంట్ తలుపులు మూసి విభజించిన తీరు తప్పు అని చెప్పినట్లు తెలిపారు. సామాజిక తెలంగాణ రావాలని చెప్పి మరీ వచ్చానని స్పష్టం చేశారు.

తాను తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని అని.. ఓట్లు పడతాయని కాదని.. ఆ రోజుల్లోనే తండాల దాహార్తిని తీర్చామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో తనను తిరగనివ్వకపోతే తెలంగాణలో వారాహి యాత్రకు పర్మిషన్ ఇచ్చారని.. కోదాడ, నల్గొండ ప్రజలు కూడా అండగా నిలిచారని స్పష్టం చేశారు.

తెలంగాణ యూత్‌కు మంచి అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తిని తాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని జనసేన నేతలు చాలా సార్లు అడిగారని.. అయితే ఆంధ్రప్రదేశ్‌లోనే అధికారం కోరుకునే వాడిని.. తెలంగాణలో అధికారం ఎందుకు కోరుకుంటానని ప్రశ్నించారు. తనకు అధికారంపై ప్రేమ కాదని.. మార్పుపైనే ప్రేమ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ ప్రజలకు విద్వేషం లేదని.. ఒకవేళ అలా ఉంటే.. తెలంగాణలో ఒక్క ఏపీ వ్యక్తి కూడా ఉండేవారు కాదని తెలిపారు.

తెలంగాణ విభజనకు వ్యతిరేకమని వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి చెప్పినప్పుడు ఈ నాయకులంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పుడు మాట్లాడకుండా వైఎస్‌ఆర్‌కు ఊడిగం చేశారని మండిపడ్డారు. తాను బెదిరింపులకు భయపడేవాడిని కాదని.. తాను ఇప్పటిదాకా ఒక్క తెలంగాణ నేతను కూడా ఒక్క మాట కూడా అనలేదని స్పష్టం చేశారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని.. ఎన్నోసార్లు తగ్గి ఉన్నానని తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ కోరుకున్న మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వల్లే సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని పేర్కొన్నారు. పాలకులు వేరు.. ప్రజలు వేరు అని.. పాలకులను తిట్టండి కానీ ప్రజలను కాదని తేల్చి చెప్పారు. దేశంలో చాలా ప్రాంతాల్లో తెలుగువారు ఉన్నారని.. అక్కడి నుంచి వారిని పంపిస్తే మన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాను చెరువును ఆక్రమించానని ఆరోపణలు వచ్చాయని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఒకవేళ తాను కబ్జా చేశానని నిరూపిస్తే.. స్వాధీనం చేసుకోండి అని సీఎం రేవంత్ రెడ్డికి చెబుతున్నానని చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని.. తానే తెలంగాణలో తిరుగుతానని.. ఇన్నాళ్లూ భరించానని.. ఇకపై జనసేన పోటీ చేస్తుందని.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు.

 

  Last Updated: 02 Jun 2026, 05:35 PM IST