Mission Bhagiratha: ‘మిషన్ భగీరథ’కు కేంద్ర ప్రభుత్వ అవార్డు!

మిషన్ భగీరథకు కేంద్రప్రభుత్వ అవార్డు ప్రకటించింది. ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది.

  • Written By:
  • Updated On - September 29, 2022 / 12:00 PM IST

మిషన్ భగీరథకు కేంద్రప్రభుత్వ అవార్డు ప్రకటించింది. ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా రక్షిత తాగు నీరు సరఫరా అవుతుంది. శుద్ధి చేసిన తాగు నీటిని ఇంటింటికీ నల్లా ద్వారా అందజేస్తూ “మిషన్ భగీరథ” దేశానికే ఆదర్శంగా నిలిచింది.

మిషన్ భగీరథ పథకం అమలు తీరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా పరిశీలించింది. తెలంగాణ వ్యాప్తంగా రాండమ్ గా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించింది. మిషన్ భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించింది.

మిషన్ భగీరథతో ప్రతీ రోజూ ఇంటింటికి నల్లాతో నాణ్యమైన తాగునీరు తలసరి 100 లీటర్లతో అందుతున్నట్టు గుర్తించింది. తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం నాణ్యత మరియు పరిమాణంలో ఇప్పటికే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న నిర్ణయానికి వచ్చింది. అన్ని గ్రామాలలో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా నిరాటంకంగా, ప్రతిరోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించబడింది. ఈ క్రమంలో ‘రెగ్యులారిటీ కేటగిరీ’ లో తెలంగాణ, దేశంలోనే నంబర్ వన్ గా గుర్తించి జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపిక చేసింది.

తాగు నీటి రంగంలో అద్భుతమైన, అనితరసాధ్యమైన పనితీరు కనపరుస్తూ మిషన్ భగీరథ దేశంలోనే ఆదర్శవంతంగా నిలచింది. అక్టోబరు 2 గాంధీ జయంతి నాడు ఢిల్లీలో అవార్డును అందుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణ ప్రగతిని గుర్తించి, మరో సారి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేసినందుకు, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.