Site icon HashtagU Telugu

TTDP: తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం దిశగా చంద్రబాబు అడుగులు

Ttdp

Ttdp

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో జరిగింది. మల్లారెడ్డితో పాటు, సీఎం చంద్రబాబుతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా మాట్లాడారు. మర్యాదపూర్వకంగా చంద్రబాబుతో భేటీ అయిన బీఆర్ఎస్ నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. తిరుమల దర్శనం కోసం తెలంగాణ నుంచి వచ్చే లెటర్స్‌ను అనుమతించాలని చంద్రబాబును నేతలు కోరారు.

చంద్రబాబుతో సమావేశం అనంతరం, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని ఉద్ఘాటించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత చంద్రబాబుని ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబు హయాంలోనే సైబరాబాద్, హైదరాబాద్ విస్తృతంగా అభివృద్ధి చెందాయని తీగల కృష్ణారెడ్డి కొనియాడారు.

మరోవైపు, తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మరియు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించి, టీడీపీలో చేరే అంశంపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి సొంతగూటికి తిరిగి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

2014 వరకు మల్లారెడ్డి టీడీపీలో ఉన్నారు, అక్కడ ఎంపీగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం మల్లారెడ్డి తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, చంద్రబాబును మల్లారెడ్డి కలవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక్కడ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణపై పట్టు సాధించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ క్రమంలో, బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంపింగ్‌ చేస్తుండటం గమనార్హం. ఈ పరిణామాల మధ్య, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా టీడీపీకి చేరుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లయితే, ఆయన త్వరలోనే బీఆర్ఎస్‌కు బైబై చెబుతూ పసుపు కండువాను కప్పుకోనున్నారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

మల్లారెడ్డికి టీటీడీపీ అధ్యక్షా పదివి:

మల్లారెడ్డి గారు ప్రస్తుతం మల్లారెడ్డి సంస్థల చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, తెలంగాణలో ఆ పార్టీకి మంచి ఉత్సాహం కలగుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తనపై దాడులు తగ్గాలంటే అధికార పార్టీకి చేరాలని తన అనుచరులతో మల్లారెడ్డి చర్చిస్తున్నారని తెలుస్తోంది.

టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో, మల్లారెడ్డి ఈ పదవిపై దృష్టి పెట్టినట్లు వినపడుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఉన్న మంచి సంబంధాలు కూడా ఆయన టీడీపీలో చేరడానికి ప్రేరణగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, మల్లారెడ్డి టీడీపీలో చేరనున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.