వివాదాస్పద అంశాలు అధికార పార్టీ టీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయి. మొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పుల జరిపిన విషయం మరువకముందే, తాజాగా మరో టీఆర్ఎస్ నేత బంధువు గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఎయిర్ రైఫిల్తో గాలిలోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు ఆలస్యంగా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. యాచారం పోలీస్ పరిధిలోని నాజ్దిక్ సింగారం గ్రామంలోని ఫామ్హౌస్లో టీఆర్ఎస్కు చెందిన విఘ్నేశ్వర్రెడ్డి తన బంధువు విక్రమ్తో కలిసి కాల్పులు జరిపినట్టు వీడియోల్లో చూడొచ్చు.
జులై 14న జరిగిన ఈ ఘటనలో సోమవారం వీడియో వైరల్గా మారినప్పటికీ ఎయిర్గన్ను ఉపయోగించినట్లు యాచారం ఇన్స్పెక్టర్ ఎస్.లింగయ్య తెలిపారు. “మేం ఎయిర్ రైఫిల్ను స్వాధీనం చేసుకుని పరీక్షకు పంపాం. ఎయిర్ రైఫిల్కు ఆయుధాల లైసెన్స్ అవసరం లేదని భారతీయ ఆయుధాల చట్టం పరిధిలోకి రాదని ప్రాథమికంగా కనుగొనబడింది. వారిని పిలిపించి విచారణ జరుపుతున్నాం. దాని ప్రకారం ముందుకు సాగుతాం’’ అని లింగయ్య తెలిపారు. ఫామ్హౌస్లో పుట్టినరోజు వేడుక కోసం దాదాపు 15 మంది యువకులు గుమిగూడారని, ఆ సమయంలో ఎయిర్ రైఫిల్ తో కాల్లులు జరిపారని ఎస్ఐ తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో తమ రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేక ప్రత్యర్థులు తమపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని విఘ్నేశ్వర్ రెడ్డి ఆరోపించారు. “నేను ఎటువంటి చట్టవిరుద్ధమైన లేదా సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో ఎప్పుడూ పాల్గొనలేదు,” అని అతను చెప్పాడు.