Posters On Amit Shah : పోస్ట‌ర్ల‌తో బీజేపీకి స‌వాల్, టీఆర్ఎస్ మార్క్ స్కెచ్!

గోవా లిబ‌రేష‌న్ డే కోసం రూ. 300 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణ‌కు ఎందుకు ఇవ్వ‌లేద‌ని నిల‌దీస్తూ పోస్ట‌ర్లు వెలిశాయి.

  • Written By:
  • Updated On - September 17, 2022 / 12:07 PM IST

గోవా లిబ‌రేష‌న్ డే కోసం రూ. 300 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణ‌కు ఎందుకు ఇవ్వ‌లేద‌ని నిల‌దీస్తూ పోస్ట‌ర్లు వెలిశాయి. హైదరాబాద్ విమోచన దినోత్సవానికి పైసా ఎందుకు ఇవ్వ‌లేదు? ఎందుకంటూ ప‌లు సెంట‌ర్ల‌లో పోస్ట‌ర్లు పెట్ట‌డం ద్వారా మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ ల నిల‌దీయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కంటోన్మెంట్ ఏరియాలోని 30 వేల మంది ఓటింగ్ హక్కును భార‌త ప్ర‌భుత్వం ఎందుకు తొల‌గించింది? మీరు దాన్ని పునరుద్ధరిస్తారా? అంటూ మ‌రిన్ని ప్ర‌శ్న‌ల సంధిస్తూ ఈ పోస్టర్లు వెల‌వ‌డం బీజేపీకి స‌వాల్ చేసిన‌ట్టు అయింది.

పోస్టర్లలో తెలంగాణ‌కు సంబంధించి ఇంగ్లిష్ లో 20 ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ? తెలంగాణకు ఐటీఐఆర్ ఎక్కడ? తెలంగాణకు మెడికల్ కాలేజీ ఎందుకు మంజూరు చేయలేదు? పసుపు బోర్డు ఎక్కడ ఉంది? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు మంజూరు చేయలేదు? అంటూ మోదీని ఉద్దేశించి ప్ర‌శ్న‌లు రాసి ఉన్నాయి. వీటిని గ‌మ‌నిస్తే టీఆర్ఎస్ సానుభూతిప‌రులు వేసిన ప్ర‌శ్న‌లుగా ఉన్నాయి. గ‌తంలోనూ ప్ర‌ధాని మోడీ తెలంగాణ‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా ఇలాంటి పోస్ట‌ర్లు, హోర్డింగ్ లు పెట్టిన విష‌యం విదిత‌మే.

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న‌ హైదరాబాద్‌ విమోచన దినోత్సవ వేడుక‌లకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా న‌గ‌రానికి వ‌చ్చారు. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు జూబ్లీ హాల్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్ పరిస‌రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ప్ర‌శ్నిస్తూ కొన్ని వాల్‌ పోస్టర్లు క‌నిపించ‌డం రాజ‌కీయ వాతావర‌ణాన్ని హీటెక్కించాయి.

తిరుమ‌ల‌గిరి, ఎస్‌డి రోడ్‌, టివోలి క్రాస్‌రోడ్‌, మారేడ్‌పల్లిలోని ప్రధాన జంక్షన్లు, కూడళ్లలో ‘మోదీ తప్పక సమాధానం చెప్పాలి’ అనే హెడ్డింగ్ తో కూడిన పోస్టర్లు క‌ల‌క‌లం చేపుతున్నాయి. స్థానిక కంటోన్మెంట్ బోర్డు అధికారులు పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని కొన్ని ప్రాంతాలలో వాటిని తొలగించారు. కానీ కొన్ని గంటల తర్వాత సమీప ప్రదేశాల్లోని గోడ‌ల‌పై ఈ పోస్ట‌ర్లు తిరిగి రావ‌డం గ‌మ‌నార్హం.