Tigers : దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..!

తెలంగాణలో పులుల సంచారం బాగా పెరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనావాసాల మధ్య తిరుగాడుతున్న సంఘటనలు తీవ్ర భయం రేపుతున్నాయి. మూడురోజుల క్రితం శ్రీశైలం హైవే పై పులి సంచారం కలకలం రేపకముందే..

  • Written By:
  • Updated On - November 25, 2021 / 01:49 PM IST

తెలంగాణలో పులుల సంచారం బాగా పెరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనావాసాల మధ్య తిరుగాడుతున్న సంఘటనలు తీవ్ర భయం రేపుతున్నాయి. మూడురోజుల క్రితం శ్రీశైలం హైవే పై పులి సంచారం కలకలం రేపకముందే.. బయ్యారం అడువుల్లో మరో పెద్ద పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. అయితే పులులు అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్నా.. పులి జాడలను గుర్తించడంలో అటవీ శాఖాధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి.

తాజాగా మహబూబ్ నగర్ జిల్లా బయ్యారం అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. అయితే కొత్తగూడెం జిల్లాలో భయంరేపిన పులినే బయ్యారం అడవులకు వెళ్లినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అల్లిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గొర్రెలను మేపేందుకు వెళ్లగా అక్కడ పులిని చూశాడు. అతని మీద దాడి చేయబోగా, గొడ్డలితో బెదిరించే ప్రయత్నం చేయడంతో పారిపోయింది. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు పులి జాడలను, వెంట్రుకలను గుర్తించినట్టు తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి, యెల్లందు మండలాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సంచరిస్తున్న అంతుచిక్కని పులి సంచారంపై నిఘా పెంచేందుకు యెల్లందు మండలం దండ గుండాల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు నిఘా పెంచారు. ఆదివారం సాయంత్రం టేకులపల్లి మండలం అందుగులగూడెం గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న పులి చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యెల్లందు మండలం దండ గుండాల, కొమురారం అటవీ ప్రాంతాల్లో అటవీ దళారులు నిఘా పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పులి సంచారాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. అటవీ వాసులతో పాటు పులిని కూడా కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అటవీ అంచుల వెంబడి ఉన్న ఆవాసాలలో పశువులు, గొర్రెలు, మేకలు మేపుకునే వారికి అవగాహన కల్పించింది.

కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అలజడి రేపిన పులి సంచారం, గ్రామీణ ప్రాంత ప్రజలను నిద్రపోనివ్వటం లేదు. దిగిడలో ఒక యువకుడిని హత మార్చిన పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు 35 మంది సిబ్బందితో 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలను అమర్చి పులి ఆనవాళ్లను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణలోని పలు అడవుల్లో పులుల సంఖ్య పెరిగిందని, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని రక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రత్యేక నిఘా లేకపోవడంతో పులులు వేటగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులులను లెక్కించేందుకు, పెరుగుతున్న పులుల గణనపై అవగాహన లోపించిందని, ఇప్పటికైనా అటవీ శాఖాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.