ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితిపై మంత్రి కూలంకషంగా సమీక్షించారు. ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు సరిపడా గ్యాస్ సరఫరా అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎక్కడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
