Telangana RTC : ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ తరుణంలో తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) యాజమాన్యం కీలక ప్రతిపాదనలు చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61 ఏళ్లకు పెంచాలంటూ రాష్ట్ర సర్కారుకు ప్రపోజల్స్ పంపింది. అయితే వయో పరిమితి పెంపునకు సంబంధించిన ప్రతిపాదనను ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీకి అందించాలని రవాణాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్టీసీ ఎండీకి ఈ నెల 11నే లేఖ రాశారని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఏడాది ఆగస్టులోనే టీఎస్ఆర్టీసీ (Telangana RTC)ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు.. ఆర్టీసీలో 43,373 మంది ఉద్యోగులు, కార్మికులు ఉండేవారు. అయితే ఆగస్టులో 343 మంది రిటైర్ అయ్యారు. ప్రభుత్వ సర్వీసులో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన విధివిధానాలు, ఉద్యోగుల క్యాడర్ ఖరారుకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఓ కమిటీని కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ కమిటీయే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకోనుంది.
టీఎస్ ఆర్టీసీ (Telangana RTC)ని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేశారు?
టీఎస్ ఆర్టీసీ నష్టాల ఊబిలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 1500 కోట్ల ఆర్థికసాయం ఇవ్వాల్సి వచ్చేది. ప్రతి సంవత్సరం ఇంత పెద్ద మొత్తం ఆర్టీసీకి ఇవ్వడం రాష్ట్ర సర్కారుకు కష్టతరంగా మారింది. మరోవైపు డీజిల్ ధర చుక్కలను అంటడంతో.. నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగాయి. దీంతో ఆర్టీసీ టికెట్ల ధరలను భారీగా పెంచారు. ఫలితంగా ఆర్టీసీ ఆదాయం పెరగడం మొదలైంది. అయినా ఆదాయం కన్నా అప్పుల భారమే ఎక్కువగా ఉండటం ఆర్టీసీ మనుగడకు పెద్ద ముప్పుగా పరిణమించింది. ఈక్రమంలోనే కేసీఆర్ సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వస్తే.. ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు సర్కారీ ఉద్యోగులుగా మారతారు. వారికి ప్రభుత్వమే జీతభత్యాలు చెల్లిస్తుంది.