KTR: పట్టణాల్లోనూ ‘‘ఉపాధి’’ మార్గాలను అందించాలి!

దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరి ఒక ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని..

  • Written By:
  • Publish Date - January 27, 2022 / 08:27 PM IST

దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరి ఒక ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని రానున్న బడ్జెట్ సమావేశాల్లో పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన స్థితిగతులు, వాటిలో సానుకూల మార్పుకు చేపట్టాల్సిన కార్యక్రమాల పైన సూచనలను మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. పట్టణీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామం (ట్రెండ్) అని, ఇందుకు భారతదేశం ఏ మాత్రం మినహాయింపు కాదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెరుగైన ఉపాధి జీవన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలవైపు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతులపైన తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని, ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటుందని, 2030 నాటికి దేశంలోని 40 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతుందన్నారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉన్నదన్నారు. పెద్ద ఎత్తున పట్టణాల్లోకి ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో పట్టణ పేదరికం పైన దేశంలోని అన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. పట్టణ పేదలకు అవసరమైన హౌసింగ్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం ,విద్య, సామాజిక భద్రత ,జీవనోపాదుల వంటి అంశాల పైన ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పట్టణంలోని పేదలకు పైన పేర్కొన్న అంశాల్లో సరైన అవకాశాలు కల్పించినప్పుడే వారు నాణ్యమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంటుందని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పట్టణ పేద ప్రజలు నాణ్యమైన జీవితాన్ని అందుకోవాలంటే వారి ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందని, అయితే దురదృష్టవశాత్తు పట్టణ పేదలు అత్యధిక శాతం అసంఘటిత రంగంలో కార్మికులుగా, చిరు వ్యాపారులుగా, కూలీలుగా పని చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఒక్కరోజు ఉపాధి దొరకక ఉంటే వారి జీవన స్థితిగతులు తారుమారయ్యే దయనీయమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారి ఉపాధికి, ఆదాయానికి మరింత హామీ, భరోసాను ఇచ్చే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పట్టణాల్లోని పేదల కోసం చేపట్టాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి సూచించారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం వలన పట్టణ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ లెక్కల ప్రకారం 2019 అక్టోబర్ నుంచి 2021 మార్చ్ మధ్యలో గరిష్టంగా 21 శాతం నిరుద్యోగం నెలకొని ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణాల్లోని పేదలకు అండగా ఉండడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అత్యవసం అని మంత్రి కేటీఆర్ అన్నారు.