Site icon HashtagU Telugu

Money Golmal: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌‌లో రూ.1.20 కోట్లు మాయం..

Funds Misuse

Funds Misuse

Money Golmal: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో నిధుల గోల్‌మాల్ అంశం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.60 లక్షలను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కోసం కేటాయించిన నిధుల్లోనూ రూ.1.20 కోట్లు దుర్వినియోగం అయినట్లు ఫిర్యాదు నమోదైంది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సురేశ్, కోశాధికారి శ్రీరాములుపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీరాములుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, సాట్స్ నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా, అసోసియేషన్‌కు అధికారిక ఖాతా ఉన్నప్పటికీ, మరో అనధికారిక ఖాతా నుంచి రూ.60 లక్షలను విత్‌డ్రా చేసినట్లు ఆరోపించారు.

2021లో సూర్యాపేటలో జరిగిన జాతీయ జూనియర్ కబడ్డీ టోర్నీకి కేటాయించిన రూ.1.20 కోట్లు వృథా చేశారని, అందులో రూ.50 లక్షలు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని సురేశ్ తన ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ కోసం ఒక స్వచ్ఛంద సంస్థ అందించిన రూ.20 లక్షలను జిల్లా సంఘాలకు ఇవ్వకుండా శ్రీరాములే సొంతంగా వాడుకున్నారని ఆరోపించారు. ఏజీఎం (Annual General Meeting), ఈసీ (Executive Committee) సమావేశాలు నిర్వహించకుండానే నిధుల విషయంలో శ్రీరాములు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని సురేశ్ మండిపడ్డారు.

నిధుల దుర్వినియోగంపై జగదీశ్వర్ యాదవ్ తో పాటు శ్రీరాములును ప్రశ్నించినందుకు, తనను బెదిరించి మహబూబాబాద్ జిల్లా అసోసియేషన్ నుంచి తొలగించారని సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేశ్ డిమాండ్ చేశారు. ఈ నిధుల గోల్‌మాల్ ఆరోపణలపై పోలీసులు చేపట్టే దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి?

TTD : ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు.. శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన మరో విమానం