తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) యువతుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ‘ఇందిరమ్మ అమృతం’ (Indiramma Amrutham Scheme) అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి సీతక్క ప్రారంభించారు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సులో ఉండే టీనేజ్ బాలికల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనతను నివారించేందుకే ఈ కార్యక్రమం రూపొందించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఇప్పటికే చిక్కీ పంపిణీ చేస్తుండగా, ఇప్పుడు అదనంగా చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు అందించబోతున్నారు.
Lava Bold N1 : మతి పోగొడుతున్న లావా బోల్డ్ N1 సిరీస్ ఫీచర్లు
చిరుధాన్యాలలో ఐరన్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభ్యమవుతాయి. వీటిని పచ్చిగింజలతో, బెల్లంతో కలిపి తయారుచేసే చిక్కీలు శక్తివంతమైన ఆహారంగా నిలుస్తాయి. ఈ ఆహారాన్ని తీసుకునే బాలికల్లో రక్తంలో ఐరన్ స్థాయులు మెరుగవుతాయి. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించగలదు. అంతేకాకుండా ఉచిత థైరాయిడ్ టెస్టులు కూడా ఈ పథకం కింద అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం ఈ పథకం జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు అవుతోంది. అక్కడ విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వ దృష్టి పెట్టడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఆరోగ్యవంతమైన పథకాలు సమాజానికి ఎంతో అవసరం అని, మరిన్ని కార్యక్రమాలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.