Mee-Seva Charges Hike : సామాన్యులపై పెను భారం వేసిన తెలంగాణ ప్రభుత్వం

మీ సేవ నిర్వాహకుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, సర్వీస్ ఛార్జీలను ఏకంగా 50 శాతం మేర పెంచింది. పెరిగిన ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1, బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి

Published By: HashtagU Telugu Desk
Meeseva

Meeseva

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ (Me e-Seva) కేంద్రాల ద్వారా అందజేసే వివిధ పౌర సేవల ఛార్జీలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ నిర్వాహకుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, సర్వీస్ ఛార్జీలను ఏకంగా 50 శాతం మేర పెంచింది. పెరిగిన ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1, బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ ఖర్చులు మరియు సిబ్బంది వేతనాలు పెరిగిన దృష్ట్యా తమకు వచ్చే కమిషన్‌ను పెంచాలని నిర్వాహకులు కోరగా, ప్రభుత్వం సామాన్యులపై భారం పడేలా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

ఏ కేటగిరీకి ఎంత పెరిగిందంటే?

ప్రభుత్వ తాజా నిర్ణయంతో సర్టిఫికెట్ల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో కేటగిరీ-ఏ విభాగంలో ఉన్న రూ.35 సర్వీస్ ఛార్జీని ఇప్పుడు రూ.62కి పెంచారు. అలాగే కేటగిరీ-బి విభాగంలో గతంలో రూ.45 నుండి రూ.55 వరకు ఉన్న ఛార్జీని రూ.80కి పెంచారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులకు అవసరమైన ఆదాయ (Income), కుల (Cast), నివాస (Residence) ధృవీకరణ పత్రాల ధర రూ.80కి చేరింది. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Date of Birth) గతంలో రూ.40 ఉండగా, ఇప్పుడు అది రూ.62కి చేరుకుంది. వీటికి అదనంగా ప్రభుత్వం అందించే సేవలపై 18 శాతం జీఎస్టీ (GST) కూడా వర్తించనుంది. ఆర్టీఏ సేవలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు మరియు ఇతర ప్రభుత్వ దరఖాస్తులపై కూడా అదనపు ఛార్జీల భారం పడనుంది.

నిర్వాహకులకు లాభం.. వాట్సప్ సేవల లభ్యత

ఈ ధరల పెంపు వల్ల మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు వచ్చే కమిషన్ భారీగా పెరిగింది. గతంలో ఏ-కేటగిరీ సేవపై రూ.13 కమిషన్ వచ్చేది, ఇప్పుడు అది రూ.40.34కి చేరింది. ఇది నిర్వాహకుల ఆదాయాన్ని పెంచనుంది. అయితే, ప్రజలు మీ సేవ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ప్రభుత్వం ‘వాట్సప్ మీ సేవ’ (WhatsApp Me e-Seva) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. 8096958096 నంబర్ ద్వారా దాదాపు 10 శాఖలకు చెందిన 581 రకాల పత్రాలను 24 గంటల పాటు వాట్సప్‌లోనే పొందే వెసులుబాటు కల్పించింది. సాంకేతికత ద్వారా సేవలు సులభతరం చేసినప్పటికీ, సేవా రుసుముల పెంపు మాత్రం సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పెడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  Last Updated: 02 Apr 2026, 10:36 AM IST