Telangana BJP: కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేస్తాం – ‘బండి సంజయ్’

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేసే వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

  • Written By:
  • Updated On - March 11, 2022 / 11:30 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేసే వరకు బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసి ప్రజాస్వామిక తెలంగాణ సాధించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం బీజేపీ సాగిస్తున్న మహోద్యమానికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను పార్టీ సీనియర్ నేతలు, నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జరిగిన ‘ఆశీర్వచన’ కార్యక్రమానికి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుండి వచ్చిన వేద పండితులు, పూజారులు వేద మంత్రోచ్చారణాలతో ఆశ్వీరదించారు. మెట్ పల్లి స్వామిజీ ప్రణవానంద, వేములవాడ రాజన్న ఆలయ పూజారులు బండి సంజయ్ కు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. డాక్టర్ కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, రఘునందన్ తదితరులు పుష్పగుచ్చం, శాలువాతో సంజయ్ ను సత్కరించారు. బండి సంజయ్ తో ఫొటోలు దిగేందుకు నాయకులు, కార్యకర్తలు పోటీ పట్టారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ సారథ్యంలో రెండేళ్ల కాలంలో చేపట్టిన పార్టీ కార్యక్రమాలను, సాధించిన విజయాలను వివరించారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ(సంస్థాగత) లకు ప్రత్యేక క్రుతజ్ఝతలు తెలిపారు బండి సంజయ్. ఇంత గొప్ప పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉంది. ప్రధాని మోదీ స్పూర్తితో ముందుకు సాగుతున్నాం.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ నెర్చవేర్చకుండా జిమ్మిక్కులు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. వారికి భరోసా కల్పించేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఈ రెండేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టంది. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం ఉద్యమాలు చేశాం. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాం. ఇందుకోసం నాతో సహా అనేక మంది జైలుకు వెళ్లిన సంగతిని గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు బండి సంజయ్.
ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం కార్యకర్తలు తెగించి కొట్లాడుతున్నారు. అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. జైళ్లకు వెళ్లారు. అయినా వెనుకాడకుండా పోరాడుతున్న కార్యకర్తలకు శిరసు వంచి నమస్కరిస్తున్నా అన్నారు బండి సంజయ్. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చేందుకు, ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం బీజేపీ పోరాడుతోంది. అధికారానికి దగ్గరగా వచ్చాం. ఏ ఎన్నిక వచ్చినా బీజేపీ కైవసం చేసుకుని సత్తా చూపుతోంది. ఎంత డబ్బు వెదజల్లినా, అధికార కుట్రలు చేసినా, మరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే సమయంలో కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొడుతూ బీజేపీని, కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారు.

టీఆర్ఎస్ డౌన్ ఫాల్ క్లైమాక్స్ కు చేరింది. అందుకే కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా డబ్బులిచ్చి స్ట్రాటజీ టీం లను పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారు. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర చేశాం. ఏప్రిల్ 14 నుండి రెండో దశ పాదయాత్రను ప్రారంభించబోతున్నాం. కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేస్తాం. ప్రజాస్వామిక తెలంగాణ సాధిస్తాం. బెంగాల్ తరహా రాజకీయాలు చేసినా, తాలిబన్, రజాకార్ల పాలన చేసినా ఎదిరించి పోరాడేందుకు మేం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు బండి సంజయ్.
కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. కమలం పువ్వును నిరంతరం వికసింపజేస్తాం. ఈ మహోద్యమంలో వెన్నంటి ఉన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు బండి సంజయ్.
ఇక అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు బీజేపీ చీఫ్ చెప్పుకొచ్చారు.