మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.
మద్యం తయారీ కంటే, దానిని ప్యాక్ చేసే గాజు బాటిళ్ల తయారీ ఇప్పుడు కంపెనీలకు భారంగా మారింది. భారత్ తన సహజవాయువు అవసరాల కోసం 40% వరకు ఖతార్పైనే ఆధారపడుతుంది. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగడంతో కమర్షియల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. నిజానికి బీర్ తయారీ కంటే దాని ప్యాకేజింగ్ వాటా 40 శాతం. కాగా, స్పిరిట్స్ (విస్కీ, బ్రాండీ తదితరాల్లో) ఇది 20 శాతం వరకు ఉంటుంది. గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడటం వల్ల అది నేరుగా గాజు బాటిళ్ల తయారీపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పెరిగిన గ్యాస్ కష్టాలు, కమర్షియల్ గ్యాస్ ధరల వల్ల గాజు బాటిళ్ల ధర 15-20 శాతం పెరిగినట్లు ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ చోప్రా అంటున్నారు. అంతర్జాతీయంగా రవాణా ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు అదనంగా 10-15% ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. బీర్ కాన్ల తయారీకి వాడే అల్యూమినియం ధరలు కూడా 15% పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.
సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వేసవి తాపానికి బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి గ్యాస్ లభ్యత తగ్గితే గాజు ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవు. దీనివల్ల మార్కెట్లో బాటిళ్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పరిశ్రమలో ఏడాదికి సుమారు 12 నుంచి 13 కోట్ల బాటిళ్ల కొరత ఇప్పటికే ఉంది. దీనివల్ల డిమాండ్కు తగ్గ సరఫరా లేక మార్కెట్లో బాటిళ్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మొత్తానికి, పశ్చిమాసియా యుద్ధం సామాన్యుడి వంటింటి గ్యాస్ నుంచే కాకుండా, మందుబాబుల ‘చిల్’ అయ్యే ఆశలపై కూడా నీళ్లు చల్లుతోంది. పీక్ సీజన్లో సరఫరా తగ్గితే వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్లు దొరక్క ఇబ్బంది పడక తప్పదు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు కొన్ని కంపెనీలు ముందస్తుగా ప్లాన్ చేస్తున్నాయి. పెరుగుతున్న ధరల కారణంగా మందుబాబులు ఇప్పుడు మద్యం తాగాలంటేనే భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
