Telugu Students : అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. అరిజోనా యూనివర్సిటీలో చదువుతున్న లక్కిరెడ్డి రాకేశ్రెడ్డి (23), రోహిత్ మణికంఠ రేపాల (25) ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మే 8వ తేదీన మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ వారం క్రితమే ఎంఎస్ కోర్సును పూర్తి చేసి డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఈసందర్బంగా 16 మంది స్నేహితులతో కలిసి ఈ నెల 8న టూర్ కోసం జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ సరదాగా గడుపుతుండగా రాకేశ్, రోహిత్లు ప్రమాదవశాత్తూ జలపాతంలో మునిగిపోయారు.గజ ఈత గాళ్లతో గాలించగా 25 అడుగుల లోతులో ఇద్దరి మృతదేహాలు దొరికాయి.
We’re now on WhatsApp. Click to Join
లక్కిరెడ్డి రాకేశ్రెడ్డి ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన లక్కిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు. లక్కిరెడ్డి రాకేశ్రెడ్డి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సును ఇండియాలోనే పూర్తి చేశాడు. అనంతరం ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అయినా అందులో చేరకుండా ఎంఎస్ కోర్సు చేసేందుకు అమెరికాకు వెళ్లాడు. ఎంఎస్ కోర్సు పట్టా పుచ్చుకొని భారత్కు తిరిగి రావాల్సిన రాకేశ్రెడ్డి .. విగత జీవిగా తిరిగి వస్తుండటంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకటి రెండు రోజుల్లో లక్కిరెడ్డి రాకేశ్రెడ్డి మృతదేహం ఖమ్మంకు చేరుతుందని తెలుస్తోంది. గత తొమ్మిదేళ్ల కాలంలో ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి తొమ్మిది మంది చనిపోయారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనూ ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి తెలుగు విద్యార్థులు జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్కాంట్లాండ్ లో జరిగింది. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా బ్రిటన్లోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన విద్యార్థి. స్కాట్లాండ్లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న వీరిద్దరూ మరో ఇద్దరితో కలిసి పెర్త్షైర్లోని లిన్ ఆఫ్ తమ్మెల్కి వెళ్లారు. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తుగా వీరిద్దరూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు.