Kerala Election Results : కేరళంలో గేమ్ ఛేంజర్ గా ‘రేవంత్ రెడ్డి’

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కేరళలో అధికార మార్పిడి సంప్రదాయం మళ్ళీ పునరావృతమైంది. పినరయి విజయన్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని భావించిన ఎల్‌డిఎఫ్ కేవలం 30 నుండి 40 స్థానాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Kerala

Cm Revanth Kerala

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ విజయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేరళలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కలలుగన్న ఎల్‌డిఎఫ్ (LDF) ఆశలపై యూడీఎఫ్ నీళ్లు చల్లింది. ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండి, మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసింది. కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోయారు. త్రివేండ్రం, కొచ్చి, కోజికోడ్, కన్నూర్ వంటి కీలక నగరాల్లో ఆయన నిర్వహించిన సభలకు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా పినరయి విజయన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన విమర్శలు ఓటర్లను ఆలోచింపజేశాయి. “విజయన్‌కు వేసే ఓటు మోదీకి వేసినట్లే” అంటూ ఆయన ఇచ్చిన నినాదం కేరళలో కాంగ్రెస్ పట్ల సానుకూలతను పెంచింది. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉదాహరణగా చూపుతూ కేరళ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడంలో ఆయన విజయవంతమయ్యారు.

గాంధీ భవన్‌లో సంబరాలు.. ‘గేమ్ ఛేంజర్’ రేవంత్

కేరళలో కాంగ్రెస్ కూటమి అఖండ విజయం దిశగా వెళ్తుండటంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. కేరళలో పార్టీ విజయం వెనుక రేవంత్ రెడ్డి కష్టం ఉందంటూ ఆయనను “గేమ్ ఛేంజర్”గా అభివర్ణిస్తూ భారీ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. పొరుగు రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం రేవంత్ రెడ్డి నాయకత్వానికి దక్కిన మరో గుర్తింపుగా కార్యకర్తలు భావిస్తున్నారు.

విజయన్ సర్కార్‌కు షాక్.. పతనమైన ఎల్‌డిఎఫ్ కోట

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కేరళలో అధికార మార్పిడి సంప్రదాయం మళ్ళీ పునరావృతమైంది. పినరయి విజయన్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని భావించిన ఎల్‌డిఎఫ్ కేవలం 30 నుండి 40 స్థానాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి విజయన్ కూడా తన నియోజకవర్గమైన ధర్మడంలో గట్టి పోటీ ఎదుర్కోవడం గమనార్హం. కేరళ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారని, రేవంత్ రెడ్డి వంటి యువ నాయకుల ప్రచారం ఆ మార్పుకు మరింత వేగాన్ని ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Last Updated: 04 May 2026, 06:07 PM IST