పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాన్ని తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక చర్యలు అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఉద్రిక్తతలు మరికొన్ని వారాల పాటు కొనసాగుతాయని ప్రకటించడంతో, సోషల్ మీడియా వేదికగా పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఏర్పడబోతోందనే వార్తలు కార్చిచ్చులా వ్యాపించాయి. ఈ రూమర్స్ ప్రభావంతో సోమవారం రాత్రి తారావీ ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా వేలాది మంది వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు చేరుకోవడంతో నగరం అంతటా భారీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి.
హైదరాబాద్లోని దాదాపు అన్ని ప్రధాన పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ ప్రాతిపదికన వాహనదారులు బారులు తీరారు. కేవలం వాహనాల ట్యాంకులు నింపుకోవడమే కాకుండా, రాబోయే రోజుల్లో పెట్రోల్ దొరకదేమో అన్న ఆందోళనతో ప్లాస్టిక్ బాటిళ్లు, పెద్ద పెద్ద క్యాన్లలో కూడా చమురును నింపుకుని వెళ్తుండటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, అసలేం జరుగుతుందో తెలియని సామాన్య జనం కూడా భయాందోళనతో బంకుల వైపు పరుగులు తీశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఇప్పటికే 9 శాతం పెరగడం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది.
భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 88 శాతం ఇతర దేశాలపై ఆధారపడుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, ప్రస్తుతానికి దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ ధరల ప్రభావం దిగుమతులపై పడినప్పటికీ, రిటైల్ ధరల్లో వెంటనే మార్పులు ఉండవని, ప్రభుత్వం వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, అనవసరంగా పెట్రోల్ నిల్వ చేసి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
